
ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు అనాలోచితం
రాజమహేంద్రవరం సిటీ: మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లను కూటమి సర్కారు తొలగించడం అనాలోచిత చర్య అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నియమించిన తమను గడువు పూర్తి కాకుండానే కూటమి ప్రభుత్వం తొలగించిందంటూ ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర హైకోర్టులో భరత్రామ్ ఆధ్వర్యాన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా భరత్రామ్ రాజమహేంద్రవరంలో శుక్రవారం మాట్లాడుతూ, ప్రజలకు ఇంటి వద్దనే రేషన్ సరకులు అందించే సదుద్దేశంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ నిరుద్యోగులకు సబ్సిడీపై ఎండీయూ వాహనాలు అందించిందని అన్నారు. రూ.5.23 లక్షల విలువైన వాహనానికి లబ్ధిదారులు రూ.70 వేలు చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి, వ్యాన్ కొనుగోలు చేసి, నిరుద్యోగ యువకులకు పంపిణీ చేసిందన్నారు. ఎండీయూ ఆపరేటర్కు నెలకు రూ.18 వేలు, హెల్పర్కు రూ.6 వేలు, పెట్రోలు ఖర్చులు 3 వేలు, ఏటా రూ.10 వేల ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా ప్రభుత్వం నిబంధనలు పెట్టిందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,500 మంది ఎండీయూ ఆపరేటర్లు రేషన్ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనాలోచితంగా జూన్ 1 నుంచి ఈ వాహనాలను తొలగించేందుకు జీఓ జారీ చేయడంతో వేలాది మంది రోడ్డున పడే దుస్థితి నెలకొందన్నారు. ఎండీయూ ఆపరేటర్ల తరఫున వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించిందని భరత్రామ్ తెలిపారు.
వైఎస్సార్ సీపీ యువజన
విభాగంలో పలువురి నియామకం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆరే శ్రీను (రాజమహేంద్రవరం సిటీ), కార్యదర్శులుగా కె.మణిబాబు (కొవ్వూరు), సత్తి సాయి వెంకటకృష్ణ ఈశ్వర్రెడ్డి (గోపాలపురం), సంయుక్త కార్యదర్శులుగా చేకూరి వీఎస్ రామకృష్ణంరాజు (రాజానగరం), ముచ్చకర్ల రవి (గోపాలపురం), నల్లమిల్లి విజయ మణికంఠ రెడ్డి (అనపర్తి), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మేడుబోయిన గంగరాజు (గోపాలపురం), స్టేట్ వలంటరీ వింగ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవ రెడ్డి (అనపర్తి), వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తోమండ్రు రమేష్(గోపాలపురం)లను నియమించారు.
డెల్టాలకు రేపటి నుంచి
నీటి విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి ఖరీఫ్ సాగు అవసరాలకు ఆదివారం నుంచి గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ కె.గోపీనాథ్ తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు గోదారమ్మకు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు ముందస్తుగా పంట వేసుకునేందుకు వీలుగా జూన్ 1నే నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం క్లోజర్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి 15 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గుర్రపు డెక్క తొలగింపు పనులకు ఇబ్బందులు ఉండవన్నారు. సకాలంలో పంటలు వేసుకునేందుకు రైతులు సన్నద్ధం కావాలని గోపీనాథ్ కోరారు.
6 వరకూ రైల్వే గేటు మూసివేత
కడియం: స్థానిక రైల్వే గేటును జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గేటు మూసివేస్తున్నామన్నారు. కడియం నుంచి రాజవోలు వెళ్లేవారు ప్రత్యామ్నాయ రోడ్డు వినియోగించుకోవాలని కోరారు.

ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు అనాలోచితం