
ఇంటి వద్దకు రానంటున్న వైద్యం
వైద్యానికి మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు ఇంటి వద్దనే వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ సేవలను 2022లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి పీహెచ్సీలో డాక్టర్తో కలిపి 14 మంది సిబ్బందిని నియమించింది. ప్రతి 5 వేల జనాభాకు ఒక స్పెషలిస్టు డాక్టర్ను అందుబాటులో ఉంచింది. 2023 జనవరి నుంచి ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇంటి వద్దనే బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు చేసి మందులు అందించేవారు. పీహెచ్సీ డాక్టర్ ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి వెళ్లి ఓపీ సేవలందించేవారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద మంచం పట్టిన రోగులకు వారి ఇళ్ల వద్దనే వైద్య సేవలు, మందులు అందించేవారు. ఈవిధంగా ఒక్కో ఏడాది సుమారు 8 లక్షలకు పైగా ఓపీ సేవలు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఫలితంగా ప్రజలు నేడు వైద్య సేవల కోసం సుదూరంగా ఉన్న ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
దూరమైన ఆరోగ్య సేవలు
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 368 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. కొన్నిచోట్ల వైద్యులను తొలగించి, నర్సులకు బాధ్యతలు అప్పగించడంతో మెరుగైన వైద్యం అందడం లేదు. ఫలితంగా దీర్ఘకాలిక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.