
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెకండ్, ఫైనల్ ఇయర్ ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామచంద్రరావు బుధవారం విడుదల చేశారు. ఫైనల్ ఇయర్ (ఆరో సెమిస్టర్) ఫలితాలకు సంబంధించి బీఏ 91.30 శాతం, బీకాం 94.03 శాతం, బీబీఏ 97.92 శాతం, బీఎస్సీ 87.50 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ (నాలుగో సెమిస్టర్) ఫలితాలలో బీఏ 74.1 శాతం, బీకాం 81.36 శాతం, బీబీఏ 81.65 శాతం, బీఎస్సీలో 80.44 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఎస్సీ యువతకు ఉపాధి శిక్షణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు లీడ్ క్యాప్, సీడాప్ ద్వారా లెదర్ ఫుట్ వేర్ తయారీ కోర్సులో 60 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం ఆసక్తి కలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కార్యనిర్వాహక సంచాలకులు జె.సత్యవతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన వారితో పాటు ఫెయిలైనవారు కూడా శిక్షణకు అర్హులే. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. గుంటూరులోని నల్లపాడులో ఉన్న శ్రీకృష్ణసాయి ఎడ్యుకేషన్ సొసైటీలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉచితంగా భోజనం, వసతితో కూడిన సదుపాయాలు కల్పిస్తారు. మరిన్ని వివరాలకు 90309 24569, 79813 49691 నంబర్లను సంప్రదించాలి.
వ్యక్తిని రక్షించి.. యువకుడి మృతి
ఎస్.రాయవరం (అనకాపల్లి): రేవు పోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడబోయే ప్రయత్నంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై విభీషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. తుని మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్ ఇషాక్ మదీనా వలీ (20), షేక్ అలీషాలు అదే గ్రామానికి చెందిన షేక్ అహ్మదుల్లా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బుధవారం అనకాపల్లి జిల్లా రేవు పోలవరం తీరానికి వచ్చారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సముద్రంలోకి కొట్టుకు పోతున్నట్టు గమనించారు. ఒడ్డున ఉన్న మహిళ బిగ్గరగా అరవడంతో విన్న ఇషాక్ మదీనా వలీ, అలీషాలు సముద్రంలోకి వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు. ఇంతలో రాకాసి అలలు పోటెత్తడంతో ఇషాక్ మదీనావలీ కొట్టుకుపోయాడు. వెంటనే స్థానిక మత్స్యకారులు బయటకు తీసినప్పటికీ ప్రాణాలు నిలువలేదు. అతడి మృతదేహాన్ని నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాల విడుదల