
అటు కళ్యాణ శోభ... ఇటు బ్రహ్మోత్సవ ప్రభ
ఐ.పోలవరం: నిత్య కళ్యాణ కాంతుడైన భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి అయిదు రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలు బ్రహ్మానందాన్ని ఇవ్వనున్నాయి. తమ గోత్ర నామాలతో స్వామి ముందు కూర్చుని కల్యాణాలు చేయించుకుంటూ ధన్యమయ్యే భక్తులు మురమళ్ల పుణ్య క్షేత్రంలో కన్నుల పండువగా జరగనున్న స్వామి బ్రహ్మత్సవాల్లో పాల్గొననున్నారు. ఆలయంలో బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందుకు నాందిగా గ్రామంలోని మహిళలు ఆలయ ఆవరణలో పసుపు కొమ్ములను రోకట్లో కొట్టి బ్రహ్మోత్సవాలకు శుభాన్ని అద్దారు. శైవాగమ పద్ధతిలో స్వర్ణ రుద్రాక్ష కంకణ, స్వర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకస్వాముల, అధికారుల పర్యవేక్షణలో ఈ అయిదు రోజుల క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులను చేసే కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పండితులు పంచామృతాలతో స్వామి వారికి, అమ్మవారికి స్నానాలు చేయించారు. బ్రహ్మోత్సవ కల్యాణ మూర్తులకు జంపన రామకృష్ణంరాజు దంపతులు అర్చకస్వాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, స్వామి వారిని, అమ్మవారిని భద్రపీఠంపై ఉంచి ప్రత్యేక అలంకరణలో గ్రామోత్సవాన్ని కన్నుల వైకుంఠంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరేశ్వరుని కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవంలో ఎదురు సన్నాహం, ద్వాదశ ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మి నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వీరేశ్వరస్వామి ఆలయంలో
ఆరంభమైన బ్రహ్మోత్సవాలు
అయిదు రోజులపాటు
అలరించనున్న ఆధ్యాత్మిక సంబరాలు

అటు కళ్యాణ శోభ... ఇటు బ్రహ్మోత్సవ ప్రభ