
టీడీపీ నేతల కవ్వింపు చర్యలు
● మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై దాడికి యత్నం
● పెదపూడిలో కారును అడ్డగించడంతో
ఉద్రిక్త పరిస్థితులు
పెదపూడి: గ్రామంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి దోమాడ గ్రామం నుంచి అనపర్తి వెళుతున్న వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారును టీడీపీ నాయకులు అడ్డగించి దాడికి ప్రయత్నించారు. కొంతమంది కారు ముందు కూర్చుని కారును కదలనివ్వలేదు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు రావడంతో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. దీంతో కొంత సమయం తరువాత తీవ్ర ఉద్రిక్తతల నడుమ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారులో వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దోమాడ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడి అనపర్తి బయలు దేరారు. ఈలోపుగా మాజీ ఎమ్మెల్యేను అడ్డగించడానికి పెదపూడి మార్కెట్ సెంటర్లో టీడీపీ నాయకులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కారులో వస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వెంటనే మాజీ ఎమ్మెల్యే కారులోంచి కిందకు దిగాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులపై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దోమాడ గ్రామంలో గృహాలు కోల్పోయిన బాధిత మహిళలు, నాయకులు, ప్రజలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మార్కెట్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి కారులో వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యేకు దళిత, ప్రజా సంఘాల నాయకులు, దోమాడ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు పెద్ద ఎత్తున అండగా నిలిచారు.
‘రామకృష్ణారెడ్డి.. నీ హత్యా రాజకీయాలకు భయపడను’
‘ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.. నీ హత్యా రాజకీయాలకు నేను భయపడను’ అని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమాడ గ్రామంలో బాధితులకు సాయం చేసి వస్తే నీ టీడీపీ గూండాలు, రౌడీలను పంపించావా అని దుయ్యబట్టారు. ఖబడ్దార్ రామకృష్ణారెడ్డి.. ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసినా నీ అవినీతి అక్రమాలను ఎండగడుతూనే ఉంటాను. నీ అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. నాకు అండగా, రక్షణగా నిలిచిన దళిత ప్రజా సంఘాల నాయకులు కొండబాబు, ఆదినారాయణ, ఏనుగుపల్లి కృష్ణ, దోమాడ బాధితులు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
పెదపూడిలో
మాజీ ఎమ్మెల్యే
కారును
దౌర్జన్యంగా
అడ్డుకుంటున్న
టీడీపీ నాయకులు