
రూ.12.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం
ముగ్గురు దొంగల అరెస్టు
మామిడికుదురు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగల ముఠాను నగరం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12.50 లక్షల విలువైన 133 గ్రాముల బంగారం, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నగరం పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ ఈ చోరీలకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఆలమూరు మండలం ఖండ్రిగపేటకు చెందిన వాసంశెట్టి వీరబాబు, గువ్వల చంద్రశేఖర్, పెదపళ్లకు చెందిన కుడుపూడి నాగరాజులను అరెస్టు చేశామన్నారు. ఈ చోరీ కేసుల్లో మరో నిందితుడు గుత్తుల సుభాష్ పరారీలో ఉన్నాడని చెప్పారు. వీరిపై నగరం, తాడేపల్లిగూడెం, తడికలపూడి, ద్వారకా తిరుమల, దేవరపల్లి, దెందులూరు, పెరవలి, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనం కేసులు నమోదయ్యాయన్నారు. వీరు చైన్ స్నాచింగ్లతో పాటు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడతారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బంగారం అమ్మేందుకు వెళ్తుండగా వీరిపై అనుమానం వచ్చి నగరం ఎస్సై చైతన్యకుమార్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చోరీ నేరాల గుట్టు రట్టు అయ్యిందన్నారు. దొంగలను పట్టుకోవడంతో చాకచక్యంగా పనిచేసిన సీఐలు భీమరాజు, గజేంద్ర (సీసీఎస్), ఎస్సైలు చైతన్యకుమార్, పరదేశి, కానిస్టేబుళ్లు కృష్ణసాయి, శ్రీను, దుర్గాప్రసాద్, అర్జునరావు, సుభాకర్, బ్లెస్సన్ను ఎస్పీ కృష్ణారావు అభినందించారు.