
శిశిరంలో వసంతంలా..
● మోడువారిన భారీ వృక్షాలకు పునరుజ్జీవం ● కడియం నర్సరీ రైతుల ఘనత
కడియం: శిశిర రుతువులో ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడుల్లా మారుతూంటాయి. అలా మోడువారిన చెట్లన్నీ.. తిరిగి వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తూ లేచివుళ్లు వేసి.. చూస్తూండగానే తిరిగి ఆకుపచ్చని శోభను సంతరించుకుంటాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ, అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం, ఇతర కారణాలతో నరికివేసే భారీ వృక్షాలు మాత్రం మోడుల్లానే మిగిలిపోతూ.. చివరకు జీవాన్ని కోల్పోతున్నాయి. దీనిపై ఇలా చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వృక్షాలకు మళ్లీ జీవం పోస్తూ.. వాటికి వసంత శోభను తీసుకుని వస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. వినూత్న రకాల మొక్కలను వేలాదిగా ఇక్కడి నర్సరీల్లో అందుబాటులో ఉంచుతూ, దేశవిదేశాల్లో కడియం ప్రాంతానికి ఎంతో గుర్తింపును తీసుకుని వచ్చిన ఈ ప్రాంత రైతులు.. భారీ వృక్షాలకు పునరుజ్జీవం పోస్తూ, కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మోళ్లుగా మిగిలిన రావి, మర్రి, జమ్మి, జువ్వి, బాదం, ఉసిరి, గానుగ, కదంబం, కొబ్బరి, తాటి వంటి భారీ వృక్షాలను వేర్లతో సహా పెకలించి, ఇక్కడకు తీసుకుని వస్తున్నారు. వాటిని బతికించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. దీనికోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒకవేళ తీసుకువచ్చిన వృక్షం చనిపోతే, ఆ మేరకు నష్టాన్ని కూడా వీరు భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. చెట్టు ఎంత భారీ సైజులో ఉన్నప్పటికీ, నిపుణుల పర్యవేక్షణలో తొలగించి, వేర్లకు ప్రత్యేక పోషణ చేపడుతున్నారు. వేర్లు దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుని, ట్రాలీలపై తీసుకుని వస్తున్నారు. అలా తెచ్చిన చెట్లకు మినరల్స్, సూక్ష్మ పోషకాలు (మైక్రో న్యూట్రియెంట్స్) అందించి, మాను నుంచి చిగుళ్లు వచ్చే వరకూ పోషిస్తారు. చిగుళ్లు వచ్చి, చెట్లు మళ్లీ బతికిందని నిర్ధారించుకున్న తరువాత రవాణాకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియకు ఏడాది నుంచి నాలుగైదేళ్ల వరకూ పడుతుంది. అప్పటి వరకూ దీనిపై పెట్టుబడి పెడుతూనే ఉండాలి. చెట్టు సైజు, వయస్సును బట్టి రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకూ వీటిని విక్రయిస్తున్నారు.
ట్రాలీపై రవాణా
చేస్తున్న భారీ వృక్షం