మహాధర్నాను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

మహాధర్నాను విజయవంతం చేయండి

Mar 8 2025 12:11 AM | Updated on Mar 8 2025 12:12 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వివాదాస్పదమైన వక్ఫ్‌ సవరణ బిల్లును ఆమోదించాలనే దుర్మార్గపు ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ ఆరిఫ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే భయం నెలకొని ఉందని, కేంద్ర ప్రభుత్వ మిత్రపక్షమైన తెలుగుదేశం కూడా ఈ ప్రమాదకరమైన పథకంలో భాగంగా ఉండడం అత్యంత బాధాకరమన్నారు. అందుకే ఆఖరి అస్త్రంగా ఢిల్లీతో పాటు విజయవాడ, పాట్నాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫిబ్రవరి 12న జరిగిన అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించిందన్నారు. ఈ నిర్ణయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలు శనివారం విజయవాడలోని గాంధీనగర్‌లోని అల్‌ నకర్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్‌ వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీ ధర్నా నిర్వహిస్తున్నారన్నారు. ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్‌ ముస్లింల భావోద్వేగాలకు, భావాలకు, ఆగ్రహానికి, నిరసనకు పూర్తి నిదర్శనం కావాలని అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఐక్యంగా పాల్గొనాలన్నారు.

24, 25న బ్యాంక్‌

ఉద్యోగుల సమ్మె

రాజమహేంద్రవరం సిటీ: బ్యాంక్‌ ఉద్యోగులు, అధికారుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం యూకో బ్యాంక్‌ వద్ద సన్నాహక ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ ఉద్యోగులు, అధికారుల సంఘం నాయకులు లక్ష్మీపతిరావు, శేషుకూమార్‌, పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేయక పోవడం అన్యాయమన్నారు. ఇన్సూరెన్‌న్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో యాజమాన్యాలు గత సంవత్సరం ఒప్పుకొని ప్రభుత్వానికి పంపిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఆపాలని, మిగతా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేనిపక్షంలో ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజుల సమ్మె తప్పదని హెచ్చరించారు.

ప్రభుత్వానికి, వ్యాపారులకు

వారధిగా సీఏలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ) : ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య వారధులుగా సీఏలు పనిచేస్తున్నారని ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ చార్టర్డ్‌ అకౌంట్స్‌ కాకినాడ చాప్టర్‌ కార్యాలయంలో చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ కాకినాడ బ్రాంచ్‌ చైర్మన్‌ తాలూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 1956లో ఇన్‌కమ్‌టాక్స్‌ వ్యవస్థ ఏర్పడిందని అప్పటి నుంచి ఇప్పటి వరకూ సీఏలు ఎంతగానో సేవలందిస్తున్నారన్నారు. జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు సైతం అందించిందన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా 11 సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కార్యాలయాలను తీసుకువస్తుందన్నారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ బ్రాంచ్‌ ఉపాధ్యక్షులు టి.పవన్‌కుమార్‌, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్‌ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

మహాధర్నాను  విజయవంతం చేయండి 1
1/2

మహాధర్నాను విజయవంతం చేయండి

మహాధర్నాను  విజయవంతం చేయండి 2
2/2

మహాధర్నాను విజయవంతం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement