అల్లవరం: దేశ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న గృహ గణన, జన గణనతో పాటుగా కులాలు, ఉప కులాల గణన జరగాలని, తద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ బుధవారం ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని కులాల జనాభా, వారి స్థితిగతులు, ఆర్ధిక పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించాలని భావించి, దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. 1931 తర్వాత కుల గణన జరగలేదని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కొన్ని వర్గాలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఉప కులాలు వారీగా కుల గణన జరిగినప్పుడు, దాని ఆధారంగా రిజర్వేషన్ల వర్గీకరణ, శాసీ్త్రయ పంపిణీకి అవకాశం ఉంటుదని తెలిపారు.
ఉపాధి కూలీ మృతి
అధికారుల నిర్లక్ష్యమే కారణం :
వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్
ఉప్పలగుప్తం: మండలంలోని సరిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన ప్రమాదంలో ఉపాధి కూలీ మట్టపర్తి అనంతలక్ష్మి మృతి చెందింది. మంగళవారం ఉదయం ఉపాధి పనికి ఇంటి నుంచి బయలుదేరింది. ఇంతలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగి తలకి బలమైన గాయం తగలటంతో ఆమెను అమలాపురంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరిలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ బుధవారం మృతి చెందింది. అనంతలక్ష్మి మృత దేహానికి సరిపల్లిలో అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్డర్ పినిపే శ్రీకాంత్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పొలమూరి మోహన్బాబు నివాళులర్పించారు. కో ఆర్డినేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కేవలం అఽధికారుల నిర్లక్ష్యం, అంబులెన్స్ సమయానికి రాకపోవడంతోనే అనంతలక్ష్మి మృతి చెందిందన్నారు. రఆమె కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
వదినపై దాడి కేసులో
మరిదికి జైలు
పి.గన్నవరం: వదినపై దాడి చేసి, గాయపరచిన కేసులో మరిదికి ఏడాదిన్నర జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ కొత్తపేట జేఎఫ్సీఎం బి.జస్వంతి యాదవ్ గురువారం తీర్పు ఇచ్చారని ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. మండలంలోని యర్రంశెట్టివారిపాలెం గ్రామానికి చెందిన సిద్దిరెడ్డి సీతా మహాలక్ష్మి 2018 ఏప్రిల్ 20న తన కొత్త ఇంటి నిర్మాణం కోసం ఐదు ట్రాక్టర్ల ఇసుకను కొనుగోలు చేశారు. ఆమె ఊరువెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలోగా.. మరిది సిద్దిరెడ్డి నారాయణమూర్తి ఆ ఇసుకను మాయం చేశాడు. దీంతో మరిదిని నిలదీయడంతో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి తన కుమార్తెతో ఇంట్లో ఉండగా మరిది నారాయణమూర్తి తనపై దాడి చేసి గాయపరిచాడని సీతామహలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై ఎస్.రాము కేసు నమోదు చేశారు. ఫిర్యాది తరఫున కేసును పీపీ ఎన్.ఆనందరావు వాదించారు.
ఏరియా ఆస్పత్రిని
సందిర్శించిన కేంద్ర బృందం
అమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని, ఆ ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) ఆధ్వర్యంలో నడుస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ అండ్ సర్వీస్ సెంటర్ (డైస్)ను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ (పీఆర్సీ) డాక్టర్ రమణ యడ్లతో కూడిన బృందం బుధవారం సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేసింది. ఈ బృందానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుమలత పలు విభాగాల పనితీరును వివరించారు. జిల్లాలో జరుగుతున్న ఆర్బీఎస్కే కార్యక్రమాలను, ప్రస్తుత స్థితిగతులను ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుమలత పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బృందానికి తెలిపారు.


