సాక్షి, అమలాపురం/ రావులపాలెం: రోహిణీ కార్తె దగ్గర పడుతున్న కొద్దీ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రచండ భానుడు తీక్షణతకు వాతావరణం నిప్పుల గుండంగా మారుతోంది. గడిచిన రెండు రోజులుగా జిల్లాలో వడగాడ్పులు వీస్తున్నాయి. జిల్లాలో బుధవారం 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, 29 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిట్ట మధ్యాహ్న సమయంలో జనం రోడ్ల మీదకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. సాయంత్ర సమయంలో కూడా వేడి గాలులు వీస్తూనే ఉన్నాయి. దీనికితోడు ఉక్కపోత వాతావరణంతో జనం అల్లాడుతున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కనీసం 45 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోనసీమ జిల్లాతోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
కోనసీమలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత


