అమలాపురం రూరల్: ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని జాయింట్ కలెక్టర్ నైదియాదేవి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో వినియోగదారుల రక్షణ, జిల్లా పౌర సరఫరాల విజిలెనన్స్ కమిటీ సమావేశాలు ఆమె అధ్యక్షతన నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, వినియోగదారుల హక్కుల రక్షణపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచాలన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
తనిఖీలు చేయాలని వినతి
ప్రైవేట్ హాస్పిటల్స్, లాబ్స్, ఫార్మశీలలో ఆరోగ్య శాఖాధికారులు, సివిల్ సప్లై శాఖాధికారులు తనిఖీలు చేయాలని కోకో ఫెడ్ ప్రతినిధులు జేసీని కోరారు. కోనసీమ కోకోఫెడ్ చైర్మన్ అరిగెల బలరామూర్తి, సభ్యులు జిఎల్ఎన్ శర్మ, మాలే శ్రీనివాస నాగేష్ జేసీ నైదియాదేవిని కోరారు.
ట్రాన్స్ఫార్మర్లు భద్రపరిచేందుకు స్టోర్ రూమ్
కోనసీమ జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ట్రాన్స్ఫార్మర్లు భద్రపరిచేందుకు టెస్టింగ్ వంటి సౌకర్యాలకు తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా వసతుల కల్పనకు స్థలాన్ని కేటాయిస్తామని జేసీ వెల్లడించారు. అమలాపురంలో స్థలం కేటాయింపు కోసం రెవెన్యూ అధికారులు ఏపీ ఈపీడీసీఎల్ ఇంజినీర్లతో స్థానిక జాయింట్ కలెక్టర్ చాంబర్లో సమావేశం నిర్వహించారు.


