అధికారులకు ఎస్పీ రాహుల్ మీనా ఆదేశం
అమలాపురం టౌన్: జిల్లాలోని పాత నేరస్తులపై నిరంతర నిఘా మరింత విస్తృతం చేయాలని ఎస్పీ రాహుల్ మీనా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పాత నేరస్తులపై వారి నేర తీవ్రతను బట్టి పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల కదిలికలపై నిఽఘా పెంచి తరుచూ కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు, కామెంట్లు వల్ల సమాజం అలజడికి గురువుతోందన్నారు. సమావేశంలో తొలుత ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ఎస్పీ, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక జూమ్ మీటింగ్ నిర్వహించి నేర నియంత్రణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ 14న జిల్లాలో అంబేడ్కర్ జయంత్యుత్సవాల సందర్భంగా ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని ఐజీ ఆదేశించారు. అలాగే రోడ్డు ప్రమాదాలపై ఆయన సమీక్షిస్తూ రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ నాగ ప్రసాద్తో పాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


