‘సాక్షి’ కథనానికి అధికారుల స్పందన
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతంతో పోలిస్తే పాడి పశువుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే కానీ ప్రస్తుతం మేలు జాతి పశువుల పెంపకానికి రైతులు మొగ్గు చూపడం వలన పాల దిగుబడిలో మార్పు లేకుండా కొనసాగుతోందని జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి కె.భవానీ ప్రసాద్, ఆలమూరు ఏడీ ఎల్.అనిత అన్నారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ’పాడి కాని పాలన’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. మేలు జాతి ఆడ దూడల సంతానోత్పత్తి కోసం రాయితీ ధరలలో వీర్య నాళికలను అన్ని పశువైద్యశాలలకు సరఫరా చేస్తున్నామన్నారు. పాడి రైతులకు పశువుల దాణా ధర భారం కాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ చొరవతో పాడి రైతులకు కేవలం రూ.1,020 చొప్పున దాదాపు 950 టన్నుల పశువుల దాణా సరఫరా చేశామన్నారు. యేటా రబీ, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులకు పశుగ్రాస విత్తనాలు, పశుగ్రాసం కొరత నివారించడం కోసం 75% రాయితీతో అందజేస్తున్నామన్నారు. గతంలో ఏర్పాటు చేసిన జగనన్న పాల వెల్లువ పథకానికి అనుబంధంగా మహిళా సహకార సంఘాల ద్వారా పాల సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యవసర వైద్యం కోసం గత ప్రభుత్వంలో ప్రారంభించిన 1962 పశు సంచార వాహనాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు.


