అమలాపురం టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) 1998, 2008 ఉపాధ్యాయులకు ఫిబ్రవరి నెల జీతాల బిల్లు ఇప్పటి వరకూ ప్రభుత్వం సిద్ధం చేయలేదని కోనసీమకు చెందిన ఏపీ డీఎస్సీ–98 ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఫిబ్రవరి నెల జీతాలు ఎప్పటికి వస్తాయో తెలియని అయోమయ స్థితి రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు 5 వేల మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అమలాపురంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. సీఎఫ్ఎంఎస్ఐడీ ఆధారంగా ఎంటీఎస్కు కేటాయించిన ప్రత్యేక హెడ్లో జీతాలు చెల్లించే విధానం జనవరి వరకూ ఉండేదని గుర్తు చేశారు. ఫిబ్రవరి నుంచి అన్ని జీతాల బిల్లులు నిధి పోర్టల్ ద్వారా చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆదేశించారని తెలిపారు. దానికి అనుగుణంగా మండల స్థాయిలో ఎంటీఎస్ ఉపాధ్యాయుల వివరాలు మళ్లీ మొదటి నుంచి నమోదు చేయడానికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా నిధి పోర్టల్లో బిల్లులు ఎలా సబ్మిట్ చేయగలరని ప్రశ్నించారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతం రూ.32 వేలు మాత్రమేనని, అది కూడా ఆలస్యమైతే ఎలా అని ప్రశ్నించారు.
ఉపాధి పనులపై సమీక్ష
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లాలో ఉపాధి హామీ నిధులతో రూ.48.21 కోట్ల మెటీరీయల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ కమిషనర్ జే.సునీత ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి భవన్లో గురువారం పీఆర్ ఇంజినీరింగ్, డ్వామా, ఉపాధి ఉద్యోగులతో ఆమె, కన్వర్జెన్సీ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి బి.గోపీచంద్ పనుల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో 385 పంచాయతీల్లో నరేగా అనుసంధానంతో చేపట్టిన అభివృద్ధి మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతిపై సమీక్షించారు. మార్చి 15వ తేదీ లోపు పూర్తిచేసి బిల్లులు ఆన్లైన్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 20 పనులకు మాత్రమే అనుమతి ఉందని, ఉద్యాన పనులు, గృహ నిర్మాణ పనులకు మినహాయింపు ఉందన్నారు.
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
– డీఈవో నాగేశ్వరరావు
అమలాపురం రూరల్: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పది పబ్లిక్ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరరావు సూచించారు. ఒక స్కూల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా నియమితులైన సీఎస్, డీవో, ఏడీవోల సమావేశం నిర్వహించారు. డీఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ టెన్త్ పరీక్షలను అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావు మాట్లాడుతూ పరీక్ష పేపర్లు విద్యార్థులకు అందజేసే సమయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలన్నారు. జిల్లాలో 108 పరీక్షా కేంద్రాల్లో 19,630 మంది పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. 219 మంది సీఎస్ డీవోలను నియమించినట్లు తెలిపారు. డీవైఈవోలు జి.సూర్యప్రకాష్, పి.రామలక్ష్మణమూర్తి, కడలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన
సీనియర్ శాస్త్రవేత్త
రంపచోడవరం: పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.ఉషాకుమారి కొత్తగా విధుల్లో చేరారు. ఉద్యాన విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పని చేసిన అనుభవంతో రైతులకు శాసీ్త్రయ సలహాలు ఇవ్వడంతో పాటు గిరిజన ప్రాంతంలో ఉద్యాన పంటల్లో పరిశోధనలు, అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఇప్పటి వరకూ ఉద్యాన వెంకట రామన్నగూడెంలోని ఉద్యాన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేశానని చెప్పారు.


