అమలాపురం టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ విద్యార్థులకు ఆత్మ రక్షణ పేరుతో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఐలు, ఎస్సైలు, స్టేషన్ల సిబ్బంది వివిధ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రకటన విడుదల చేశారు. శాంతియుత సమాజ స్థాపనలో విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తొలుత ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు పాఠశాలల్లో మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మరక్షణ పద్ధతులపై అవగాహనతో ఉండాలని సూచించారు. చిన్న చిన్న టెక్నిక్స్తో అపరిచిత వ్యక్తుల నుంచి రక్షణ పొందే పద్ధతులను వివరించారు. అనంతరం మహిళా సాధికారత, సామాజిక భద్రతపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. సైబర్ భద్రత, 100, 112 నంబర్లకు ఫోన్లు చేసి రక్షణ పొందడం, ట్రాఫిక్ క్రమశిక్షణ, అపరిచిత వ్యక్తులతో అప్రమత్తత తదితర అంశాలను వివరించారు.


