జనగణనకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

జనగణనకు సన్నద్ధం

Feb 21 2026 7:38 AM | Updated on Feb 21 2026 7:38 AM

జనగణన

జనగణనకు సన్నద్ధం

అమలాపురం రూరల్‌: రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారుల సమావేశంలో కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ పాల్గొన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా గణనకు సంబంధించి సన్నద్ధత చర్యలు, శిక్షణ కార్యక్రమాలు, మాస్టర్‌ ట్రైనర్లు ఫీల్డ్‌ ట్రైనర్ల ఎంపిక వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సారి పూర్తిస్థాయి డిజిటల్‌ విధానంలో జనాభా గణన చేపట్టనున్నారు. ప్రజలకు వెబ్‌ పోర్టల్‌ ద్వారా స్వయంగా సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. తద్వారా సేకరించే సమాచారం ప్రణాళికా రూపకల్పన, విధానాల అమలు, వనరుల కేటాయింపు ప్రజా అవసరాల అంచనాకు కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

భీమేశ్వరుని సన్నిధిలో

తెలంగాణ హైకోర్టు జడ్జి

రామచంద్రపురం రూరల్‌: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ టి.మాధవీలత కుటుంబ సభ్యులతో కలసి ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నంది మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ సూపరింటెండెంట్‌ సూరపురెడ్డి వెంకటేశ్వరరావు(వెంకన్నబాబు) వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ మేడిశెట్టి హరిశ్చంద్ర వరప్రసాద్‌, ఎస్సై ఎం.లక్ష్మణ్‌, వీఆర్‌ఓలు కె.పరంజ్యోతి, జి.సురేష్‌, రామచంద్రపురం కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

కేసీఎం చొరవతో మరో

యువకుడికి విముక్తి

అమలాపురం రూరల్‌: ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి క్లిష్ట పరిస్థితులు ఎదు ర్కొన్న అమలాపురం మండలం సమనస గ్రా మానికి చెందిన కమ్మసత్తి శ్రీనును కేసీఎం అధికారు లు సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు. 2025 జూన్‌లోఒక ఏజెంట్‌ ద్వారా క్లీనింగ్‌ ఉద్యోగానికని వెళ్లాడు. ఏజెంట్‌ చెప్పిన పనికి బదులు ఎడారి ప్రాంతంలో కఠిన శ్రమకు గురిచేసే ప్రాంతంలో పని ఇవ్వడంతో అతడు ఇబ్బందులు పడ్డా డు. దీంతో అనారోగ్యానికి గురై తన తల్లిదండ్రులకు విషయం చేరవేశాడు. వారి ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ స్పందించి శ్రీనును స్వదేశానికి రప్పించే బాధ్యతను కోనసీమ సెంటర్‌ ఫర్‌ మైగ్రేషన్‌ అధికారులకు అప్పగించారు. వారు సత్వర చర్యలు తీసుకుని శ్రీనును స్వగ్రామానికి చేర్చినట్టు కేంద్రం నోడల్‌ అధికారి కె.మాధవి, సమన్వయకర్త గోళ్ల రమేష్‌ తెలిపారు.

ఫైనల్స్‌ విజేత ఐఓబీ

ఉప్పలగుప్తం: మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఉప్పలగుప్తం మండలంలోని గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదు రోజులుగా జరిగిన ఏఎస్సార్‌ జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఐఓబీ (ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌) చైన్నె జట్టు, ఇండియన్‌ బ్యాంక్‌ చైన్నె జట్లు ఫైనల్స్‌లో హోరాహోరీగా తలపడ్డాయి. రసవత్తరంగా జరిగిన పోటీలో ఐఓబీ చైన్నె జట్టు, ఇండియన్‌ బ్యాంక్‌ చైన్నె జట్టుపై 25–19, 25–19, 25–22 స్కోరుతో వరస మూడు సెట్లు గెలుచుకుని ఫైనల్స్‌లో విజేత కాగా, ఇండియన్‌ బ్యాంక్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేత ఐఓబీ జట్టుకు టోర్నీ నిర్వాహక కమిటీ రూ.1.20 నగదు బహుమతిని, ట్రోఫీని అందజేశారు.

జనగణనకు సన్నద్ధం 1
1/3

జనగణనకు సన్నద్ధం

జనగణనకు సన్నద్ధం 2
2/3

జనగణనకు సన్నద్ధం

జనగణనకు సన్నద్ధం 3
3/3

జనగణనకు సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement