శనైశ్చర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి దర్శనానికి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శనికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి తిథి కలసి రావడంతో ప్రతి శనివారం కంటే మించి వేలాదిగా భక్తులు శనైశ్చరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. శనివారం స్వామివారిని 93,552 మంది దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకుడు అయిలూరి శ్రీరామమూర్తి, అర్చకులు, వేద పండితులు ప్రాతఃకాల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ ఏసీ, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో స్వామివారి పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం వెనుక పూజా మండపాల్లో భక్తులు పూజలు నిర్వహించి, అనంతరం దర్శనానికి బారులు తీరారు. పూజలు, తైలాభిషేకాల టికెట్లు, ఆన్లైన్లో పరోక్ష పూజలు, అన్నప్రసాదం విరాళాలతో కలిపి మొత్తం రూ.55,45,620 ఆదాయం వచ్చినట్టు ఏసీ అండ్ ఈఓ సురేష్బాబు తెలిపారు.
ఒక్కరోజు దేవస్థానం ఆదాయం రూ 25.38 లక్షలు


