అంతర్వేదికి రేపు ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం చక్రస్నానం సందర్భంగా అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ డీఎల్ఏన్శర్మ శుక్రవారం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆదివారం ఉదయం 4.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ప్రతి 45 నిమిషాలకు అమలాపురం నుంచి అంతర్వేదికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వివరించారు.
మహాత్మా గాంధీకి ఘన నివాళి
అమలాపురం రూరల్: జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకున్నారని కలెక్టరేట్ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు అన్నారు. శుక్రవారం అమలాపుంలోని కలెక్టరేట్లో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గాంధీ ఆశయాలు మన జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కె.హరిశేషు తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్లో పీఆర్సీ నిధులు
కేటాయించాలి
అమలాపురం టౌన్: ప్రభుత్వ ఉద్యోగులందరికీ పీఆర్సీ పెంపుదల చేస్తూ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు గిరి ప్రసాద్వర్మ డిమాండ్ చేశారు. జిల్లా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మద్దాల బాపూజీ అధ్యక్షతన స్థానిక గొల్లగూడెంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి గిరి ప్రసాద్వర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రసంగించారు. ఉద్యోగులంతా పీఆర్సీ కమిటీ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కె.మల్లిబాబు, సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్కృష్ణ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బి.మంగాదేవి, యు.కుమారి, టి.సుజాత, కె.శివకుమార్, కామేశ్వరరావు, పీఎస్వీ ప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, కొమ్ముల స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
విష సర్పాల కలకలం
ప్రత్తిపాడు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదుట వీధిలోని ఖాళీ స్థలంలో రెండు పాములు కలకలం రేపాయి. ముత్యాల రాంబాబుకు చెందిన స్థలం ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలకు ఆవాసంగా మారింది. తొలుత 15 అడుగుల రక్త పింజర మొక్కల నడుమ తిరుగాడుతూ కనిపించింది. తరువాత మరో చిన్న పాము రావడం తో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులే జేసీబీతో ఖాళీ స్థలంలో మొక్కలు తొలగించి చిన్న పామును చంపేశారు. పెద్దపాము సమీప పొలాల్లోకి వెళ్లిపోయింది.
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11.20 గంటలకు పూర్ణాహుతి గావించారు. అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. హోమంలో 20 మంది భక్తులు పాల్గొన్నారు.
అంతర్వేదికి రేపు ప్రత్యేక బస్సులు
అంతర్వేదికి రేపు ప్రత్యేక బస్సులు
అంతర్వేదికి రేపు ప్రత్యేక బస్సులు


