వెంకన్న స్వామి.. సదా స్మరామి
కొత్తపేట: ఏడు వారాల వెంకన్నను భక్తులు మనసారా కొలిచారు.. ఆ స్వామిని చూసి తరించారు.. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. అనేకమంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వెంకన్న చెంతకు చేరుకున్నారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాఢ వీధులు, స్వామి దర్శనానికి క్యూ లైన్లు నిండిపోయాయి. ఏడు వారాల వేంకటేశ్వరా.. గోవిందా.. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పలువురు పాలకమండలి సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
వాడపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు


