శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
ఫ కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం
ఫ మార్మోగిన గోవింద నామం
కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గో విందా.. అంటూ వాడపల్లి క్షేత్రంలో స్వామివారిని భక్తజనం కొలిచింది. ఆ శ్రీనివాసుడిని చూసిన ప్రతి మది పులకించింది.. ధనుర్మాసం సందర్భంగా భక్తుల సంఖ్య పెరిగింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వాడపల్లి బాట పట్టారు. కోరిన కోర్కెలు తీరిన అనేక మంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన క్షేత్రానికి చేరుకున్నారు. దీంతో క్యూ లైన్లు నిండిపోయాయి. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పా లతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహి త ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. ఈఓ చక్రధరరావు భక్తజనంలో కలసిపోయి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు :ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి సునీత కుటుంబ సమేతంగా రాగా ఈఓ నల్లం సూ ర్యచక్రధరరావు, అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనం చేయించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ.50,42,711 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారిణిల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
శ్రీనివాసా.. శ్రీవేంకటేశా


