గోవింద.. హరి గోవింద
కొత్తపేట: గోవింద.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది.. ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసింది.. ఆ ఏడు వారాల క్షేత్రం భక్తులతో నిండింది.. ధనుర్మాసం సందర్భంగా కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం వేలాది మంది భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపించింది. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ప్రదక్షిణలు చేయగా, కోరిన కోర్కెలు తీరిన అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాది మంది రావడంతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చక స్వాముల నుంచి ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం ఆ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం స్వీకరించారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ఈ ఒక్కరోజే స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, వివిధ సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవలు, అన్న ప్రసాద విరాళం ద్వారా రూ.53,40,208 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కాకినాడకు చెందిన నాట్యవేద కూచిపూడి నృత్య బృందం వారి ప్రదర్శన ఆకట్టుకుంది.
ఫ వాడపల్లిలో ఆధ్యాత్మిక శోభ
ఫ భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం


