
వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీపీ శ్రీనివాస్ సస్పెండ్
ఫ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కారణం
ఫ ప్రలోభాలకు తలొగ్గని వారే పార్టీలో ఉంటారు
ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట రూరల్ మండలం ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ను వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించారు. మండపేట విజయలక్ష్మినగర్లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, యువనేత తోట పృథ్వీరాజ్, నాయకులు కురుపూడి రాంబాబు, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావులతో కలసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ పట్ల ఎంపీపీ శ్రీనివాస్ వ్యవహరిస్తున్న తీరుపై మండలంలోని వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకుల అభిప్రాయాలను స్వీకరించామన్నారు. వారి అభిప్రాయాలను పార్టీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నామన్నారు. అధికార కూటమి పార్టీలోకి చేరుదామంటూ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ శ్రీనివాస్ ప్రలోభ పెట్టారన్న విషయాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించిందన్నారు. తల్లిలాంటి పార్టీకి నష్టం చేసే కార్యాచరణకు పాల్పడితే సహించేది లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉంటే సంక్షేమం ఏ స్థాయిలో సామాన్యులకు అమలవుతుందో చరిత్ర చెబుతుందన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. కూటమి నాయకుల మోచేతి నీళ్లు తాగేందుకు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరన్నారు. ప్రలోభ రాజకీయాలు చేయడం మాని ప్రజాస్వామ్యయుతంగా పాలించాల్సిన అవసరాన్ని కూటమి నాయకులు గుర్తించాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ అనీ ఆ పార్టీకి వెన్నుపోటు పొడవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే ప్రజల్లో కనుమరుగు కాక తప్పదన్నారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు దూలం వెంకన్నబాబు, ఎంపీటీసీ సభ్యులు మండ సుమలత, వనుం సత్యవేణి, అన్నందేవుల కృష్ణారావు, చంద్రమల్ల పోతురాజు, చొల్లంగి సత్యవేణి, పంపన లక్ష్మి, తాతపూడి ఉష, పట్నాల నాగ వెంకట సుబ్బారావు, పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు అడబాల బాబ్జి, నాయకులు పోతుల ప్రసాద్, పలివెల సుధాకర్, అద్దంకి రమణ, వాసిరెడ్డి అర్జున్ పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీపీ శ్రీనివాస్ సస్పెండ్