మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి పాండురంగరాజు, రాణి దంపతులు రూ.3.4 లక్షల విలువైన మూడు కిలోల వెండి వస్తువులను శనివారం సమర్పించారు. దేవాలయంలో నిత్య కై ంకర్యాల కోసం వెండి బిందె, వెండి పళ్లెం, రెండు వెండి దీపం కుందులను వారు అందజేశారు. వాటికి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం అర్చకులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ ఈఓ వి.సత్యనారాయణ అభినందించారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావాలి
క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ
రాజోలు: రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. కడలి గ్రామంలో మిరాకిల్ చర్చిలో కోనసీమ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు బిషప్ శ్రావణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాన్వెస్లీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కోనసీమ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఎలా బలోపేతం చేశారో అలాగే వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ నెల 12వ తేదీన కడలి గ్రామంలో జరిగే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సెల్ అధ్యక్షురాలు ఈద సంధ్య కోరారు. బిషప్ శరత్భూషణ్ వందన సమర్పణ, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మండల పరిధిలోని మందపల్లిలో ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామిని భక్తులు శనైశ్చరా శరణు.. శరణు అంటూ వేనోళ్ల కొలిచారు. శనివారం స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చన అనంతరం భక్తులు తైలాభిషేకాలు, సర్వదర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టిక్కెట్లు, వివిధ సేవల ద్వారా రూ.1,28,585 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. అలాగే అన్నప్రసాద పథకానికి పలువురు భక్తుల ద్వారా విరాళాల రూపంలో మరో రూ.17,808 రాగా మొత్తం 1,46,393 ఆదాయం వచ్చినట్టు ఆయన తెలిపారు. సిబ్బంది, పలువురు గ్రామస్తులు అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు.
శనైశ్చరుని దర్శించుకున్న సీఐడీ డీఐజీ
ఏపీ సీఐడీ డీఐజీ రవిశంకర్ అయ్యర్, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ అడిషనల్ ఎస్పీ మధుసూధనరావు మందపల్లి క్షేత్రాన్ని సందర్శించి శనైశ్చరస్వామి వారికి ప్రత్యేక పూజలు, తైలాభిషేం, శాంతి హోమం జరిపించారు.
శృంగార వల్లభుని సన్నిధిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామివారికి రూ.3,10,502 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు.. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని సీఆర్డీఏ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు దంపతులు దర్శించుకున్నారు.

బాలబాలాజీకి రూ.3.4 లక్షల వెండి వస్తువుల సమర్పణ