రసవత్తరంగా ఏఎస్సార్ వాలీబాల్ పోటీలు
నేడు ఫైనల్స్
ఉప్పలగుప్తం: మండలంలోని గొల్లవిల్లిలో భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న ఏఎస్సార్ (అరిగెల శ్రీరంగయ్య) మెమోరియల్స్ మెన్, ఉమెన్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు గురువారం జరగనున్న ఫైనల్స్లో విజేతలుగా నిలబడడానికి తమ సత్తా చాటుతూ గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. ఫ్లడ్లైట్లలో జరుగుతున్న ఈ పోటీలకు చుట్టు పక్కల ప్రాంతాల వారితో పాటు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వీక్షిస్తున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) సికింద్రాబాద్, ఎస్ఆర్ఎం (చైన్నె) మధ్య జరిగిన రసవత్తర పోరులో 25–19, 25–22, 29–27 స్కోర్తో వరుస మూడు సెట్లను ఎస్సీఆర్ సికింద్రాబాద్ జట్టుపై ఎస్ఆర్ఎం జట్టు ఘనవిజయం సాధించింది. ఇండియన్ బ్యాంకు (చైన్నె), జీఎస్టీ (ముంబై) మధ్య జరిగిన ఆటలో 25–18, 25–16, 25–16 స్కోరుతో వరుస మూడు సెట్లను గెలుచుకుని జీఎస్టీ జట్టుపై ఇండిమన్ బ్యాంకు జట్టు విజయం సాధించింది. ఐఓబీ చైన్నె, కర్ణాటక జట్ల మధ్య జరిగిన పోరులో 25–14, 25–16, 25–21 స్కోరుతో వరుస మూడు సెట్లు కర్ణాటక జట్టుపై ఐఓబీ చైన్నె జట్టు గెలుపొందింది. జీఎస్టీ ముంబై, ఐఓబి చైన్నె జట్ల మధ్య జరిగిన పోటీలో 25–19, 25–21, 25–14 స్కోరుతో వరస మూడు సెట్లు గెలుచుకుని జీఎస్టీ ముంబై జట్టుపై ఐఓబి చైన్నె జట్టు విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుంది.


