వేసవి సెలవుల్లో తప్పని తిప్పలు
నిధులు ఇవ్వకనే ప్రచారాలు చేయాలంట!
గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు
సర్కారు తీరుపై మండిపడుతున్న
ఉపాధ్యాయులు
ఉత్తర్వులు లేకనే..
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,414 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1,40,666 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 16 వేల మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ప్రారంభమైన బడిపిలుస్తోంది కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాల్గొని ఇంటింట క్యాంపెయిన్ చేయాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా 1, 3, 6, 9 తరగతుల్లో అడ్మిషన్లు గణనీయంగా పెంచాలని, డ్రాపౌట్స్ ఉండకూడదని స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రచారం కోసం మైక్ సెట్లు, బ్యానర్ల ఏర్పాటు, ఇతర ఖర్చులకు ప్రభుత్వం ఎటువంటి నిధులూ మంజూరు చేయలేదు. ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులతో ప్రచార ఖర్చులు భరించాలని మౌఖికంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు 10వ తరగతి ఫెయిలైన విద్యార్థులకు రెమిడియల్ తరగతుల నిర్వహణ బాధ్యత కూడా ఉపాధ్యాయులపైనే పెట్టారు.
ప్రజాప్రతినిధుల మొక్కుబడి అధికారుల అతి!
బడి పిలుస్తోంది కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలు, విద్యా కమిటీల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కానీ, పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మొదటి రోజు మొక్కుబడిగా కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆపై చేతులు పైకెత్తేశారు.
కాక రేపుతున్న చిత్తూరు షోకాజ్ నోటీసులు
తాజాగా చిత్తూరు మండలంలో కేవలం మౌఖిక ఆదేశాలతో ఎన్ రోల్మెంటుకు సంబంధించి గత గురువారం ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. వేసవి ప్రణాళికలు, వివిధ వ్యక్తిగత కారణాల చేత ఈ సమావేశానికి పలువురు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. గైర్హాజరైన ఉపాధ్యాయులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘నాన్–వెకేషన్’ వైఖరి
చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖను ‘నాన్–వెకేషన్ డిపార్ట్మెంట్’లా వాడుకుంటోంది. ఒకవేళ అధికారికంగా నాన్–వెకేషన్ డిపార్ట్మెంట్గా గుర్తిస్తే ప్రభుత్వమే ఉపాధ్యాయులకు అదనంగా ‘ఆర్థిక సెలవులు’ మంజూరు చేయాల్సి వస్తుంది. ఆ భారం పడకుండా ఉండేందుకే, ప్రభుత్వం ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖిక ఆదేశాలతోనే ఉపాధ్యాయులను బెదిరిస్తూ వేసవి సెలవుల్లో పనులు అప్పగిస్తోంది.
కుప్పం మండలంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం శ్రీనివాసులు (పేరు మార్చాం) బడిపిలుస్తోంది కార్యక్రమానికి తన సొంత డబ్బులు పెడుతున్నట్టు వాపోయారు. ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదని, ప్రచారానికి సొంత జేబు నుంచి రూ.8 వేలు ఖర్చు చేసి ఫ్లెక్సీలు, తదితర ఖర్చులు పెట్టినట్లు తెలిపారు. తీవ్రమైన ఎండలో ఇంటింటి ప్రచారం చేస్తున్నామన్నారు. గత ఏడాది కంటే 50 శాతం అడ్మిషన్లు పెంచాలని ఒత్తిడి చేయడం సబబు కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిత్తూరు రూరల్ మండలానికి చెందిన సుధాకర్ (పేరుమార్చాం) అనే టీచర్ వేసవి సెలవుల నుంచి బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సొంత డబ్బులు వెచ్చించి బ్యానర్లు కట్టించి ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. తన భార్య వైద్య చికిత్సకు వేరే ఊరికి వెళ్లినందువల్ల అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాలేదని అధికారులు షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
.... జిల్లాలో ఈ రెండు ఘటనలే కాదు.. ప్రతి ప్రభుత్వ టీచర్నూ కూటమి ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి పాఠశాలల్లో 50 శాతం ఎన్రోల్మెంట్ పెంచాలని మెడపై కత్తిపెట్టింది. బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలేదు. అత్యవసర సమయంలోనూ లీవులు ఇవ్వకుండా వేధిస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.
ప్రైవేట్ బాటలో విద్యార్థులు
అంగన్న్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన పిల్లలు ఉన్నప్పటికీ, వారి పేర్లను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసే అవకాశం లేదు. ప్రైవేట్ స్కూళ్లలో చైల్డ్ ఇన్ఫో నమోదును నిలిపివేస్తేనే ఐదేళ్లు నిండిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించని అధికారులు ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అని క్షేత్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు.
టార్గెట్లతో టీచర్లపై వేధింపులు


