యాదమరి: ‘కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఎందుకు ఇవ్వడం లేదు?. అధికారులకు మాత్రం ప్రతీ నెలా జీతాలు వస్తున్నాయిగా.. మరి ప్రజల చేత ఎన్నుకోబడిన మాకెందుకు ఇవ్వడం లేదు?..’ అంటూ అధికారులపై ఎంపీపీ సురేష్బాబు నిప్పులు చెరిగారు. అధికారులకు వచ్చే జీతాలపై ఉన్న శ్రద్ధ, ప్రజాప్రతినిధుల హక్కులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అయితే అధికారులు చెప్పిన లెక్కలకు క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుపై ఎంపీటీసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆపై ఎంపీపీ సురేష్ కలుగజేసుకుని అధికారులపై విరుచుకుపడ్డారు. కొందరు అధికారులు కూటమి నేతల కనుసన్నల్లో పనిచేస్తూ ఏకపక్ష ధోరణి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.
నియామకాల్లో గోల్మాల్
మండలంలో ఇటీవల అంగన్వాడీ టీచర్ల నియా మకాల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని ఎంపీపీ ఆరోపించారు. స్థానిక పంచాయతీ పరిధిలో ని అర్హులైన అభ్యర్థులను కాదని, కూటమి నాయకుల సిఫార్సులతో పక్క పంచాయతీ వాళ్లను నియమించారని చెప్పారు. అవినీతికి పాల్పడుతున్న కొందరు అధికారులతో కలసి సభలో కూర్చోలేమని చెప్పి సభ్యులతో సభ నుంచి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీరేంద్ర, తహసీల్దార్ పార్థసారథి, ఏపీఓ సంధ్యారాణి, ఆర్డబ్ల్యూస్ ఏఈ ఉషారాణి, వైస్ ఎంపీపీ రవీంద్ర పాల్గొన్నారు.


