నగరి: పట్టణంలోని జంతు వధశాలకు అధికారికంగా గుత్త హక్కుల వేలంపాట నిర్వహించకుండానే కొంతమంది టీడీపీ నాయకులు జామియా మక్కా మసీదు, నగరి పురపాలక సంఘం జంతు వధశాఖ రుసుము 2026–27, కాంట్రాక్టర్ కళంధర్ అంటూ రశీదులు ముద్రించారు. దుకాణదారుల నుంచి మేక, పొట్టేలు ఒకటికి రూ.20, ఎద్దు, ఒంటె ఒకటికి రూ.50, కోడికి రూ.5 వసూలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక దుకాణానికి రూ.150 చొప్పున వసూలు చేయడం చర్చనీయాంశమైంది. వసూళ్ల రశీదులో 2024 ఏప్రిల్ నెల 5వ తేదీ అంటూ రాసి ఇవ్వడం అక్రమ దందాకు అద్దం పడుతోంది. వేలంపాట పూర్తికాకముందే డబ్బులు వసూలు చేస్తుండడంపై దుకాణదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు భయంతో మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు
జంతువధశాల వేలాన్ని వాయిదా వేసినట్లు ఇదివరకే ప్రకటించామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రుసుము వసూళ్లకు అధికారిక ప్రొసీడింగ్స్ ఇవ్వలేదని, అనుమతులు కూడా ఇవ్వలేదని వెల్లడించారు.
నేను టెండరు పాడితే వాయిదా వేశారు
ఈ ఏడాది మార్చి 4వ తేదీన జంతువధశాలకు వే లం పాట నిర్వహించారు. నలుగురితోపాటు నేను పాల్గొన్నాను. అందరికంటే ఎక్కువగా రూ.1,00,500 పాడాను. ఏ కారణాలు లేకుండా వేలాన్ని అధికారులు వాయిదా వేశారు. మళ్లీ మా ర్చి 10వ తేదీన వేలం పాట నిర్వహిస్తామని పెట్టలేదు. ప్రస్తుతం వేలంపాట నిర్వహించకుండానే కొందరు తామే కాంట్రాక్టర్లమంటూ వసూళ్లు చేస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టాలి. – బషీర్, నగరి


