నయా స్కామ్!
– అరికట్టలేకపోతున్న జీఎస్టీ అధికారులు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జీఎస్టీ స్కామ్ పుట్టగొడుగులా పుట్టి నేడు మహా వృక్షంలా వ్యాపిస్తోంది. ప్రజలకు అవగాహన లేకపోవడంతో సామాన్యులకు మంచి మాటలు చెప్పి వారిని బురిడీ కొట్టిస్తున్నారు. నియంత్రించాల్సిన జీఎస్టీ అధికారుల చర్యలు నామామత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అరికట్టలేరా?
ఇనుప వ్యర్థాలు(స్కాప్) వ్యాపారం మోసం చేసి రూ.కోట్లు సంపాదించవచ్చని గతంలో చిత్తూరుకు చెందిన వ్యాపారి రుచి చూపించాడు. దక్షిణాది రాష్ట్రాల్లో బోగస్ కంపెనీలను సృష్టించి లేని వ్యాపారాన్ని చేసినట్లు బిల్లులు సృష్టించాడు. కట్టని పన్నులకు బిల్లులు పెట్టి అప్పనంగా ఐటీసీ రూ.కోట్లు గడించాడు. ఈ తతంగం మరువకముందే నగరంలోని ఓ చిరు వ్యాపారిని మోసగించాడు. ఆ వ్యాపారికి దాదాపు రూ.12 కోట్ల వరకు సీజీఎస్టీ చెల్లించాలని నోటీసు రావడంతో కొత్త స్కామ్ బయటపడింది.
అదుపులో కీలకవ్యక్తి
స్కాప్తో అవినీతి రాజ్యాన్ని సృష్టించి కోట్లు వెనకేసిన వ్యాపారి.. ఇప్పుడు చిరు వ్యాపారుల జీవితాలతో అడుకొని ఐటీసీ దోచుకుంటున్నాడు. ఇతన్ని సంబంధిత అధికారులు అదుపులో తీసుకొని పలు విషయాలు రాబట్టినట్లు సమాచారం. గతంలో బోగస్ సంస్థల అకౌంట్లను లాక్ చేయగా వాటి పై నకిలీ వ్యక్తులతో హైకోర్టులో కేసు వేసి సమస్యను పరిష్కారించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు బ్యాంకుల అధికారుల పాత్ర ఇందులో ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. అకౌంట్దారుడు లేకుండా ఖాతాలను ఎలా తెరుస్తున్నారు.. ఇందులో వారి ప్రమేయం ఎంత అనే వాటిపై సందేహాలు కలుగుతున్నాయి. ఇంటి దొంగల సహకారం లేనిదే ఇంత మొత్తంతో మోసాలు చేసే అవకాశాలు ఉండవు. జీఎస్టీ ఖాతాలపై నిఘా ఉంచాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ, బ్యాంక్ అధికారులు, చార్టడ్ అకౌంట్స్ సహకారంత ఈ సిండికేటు జరిగినట్లు తెలుస్తోంది.
కొత్త ప్లాన్స్తో మోసాలు
నగరంలో తోపుడు బండ్లు మీద చిరుతిండ్లు, కూరగాయలు, పండ్లు విక్రయించే వారి అమాయకత్వాన్ని వాడుకొని ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్లు తీసుకుంటారు. చిరువ్యాపారి వివరాలతో బ్యాంక్ అకౌంట్ తెరచి సీజీఎస్టీకి లైసెన్స్ తీసుకుంటున్నారు. అనంతరం వాటి ద్వారా బోగస్ కంపెనీల పేరుతో చేయని వ్యాపారిన్ని చేసినట్లు బిల్లులు సృష్టించి ప్రభుత్వం నుంచి ఐటీసీ వసూలు చేస్తున్నారు. ఇటీవల చిత్తూరుకు చెందిన చిరు వ్యాపారికి రూ.12.32 కోట్లు సీజీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో అవాక్కయ్యాడు. నగరంలోనే వందలాది చిరువ్యాపారాలను మోసగించి ఈ దండా సాగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా వందల కోట్లు ఐటీసీ కై ్లమ్ చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అరహం పెట్రో అండ్ నాన్ పెట్రో సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్, మదీనా స్టీల్స్, జెడ్ఎఫ్ ట్రేడర్స్, యార్ స్టీల్స్, ఎమ్మార్ స్టీల్స్ ప్రైవేటు లిమిటెడ్ వంటి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి వీటితో నకిలీ బిల్లులు సృష్టించి కోట్లు గడించినట్లు అధికారులు గుర్తించారు.


