శుద్ధ అబద్ధం | - | Sakshi
Sakshi News home page

శుద్ధ అబద్ధం

Nov 30 2025 7:36 AM | Updated on Nov 30 2025 7:36 AM

శుద్ధ

శుద్ధ అబద్ధం

ఆర్వో ప్లాంట్‌ల నిర్వహణపై ఆరోపణలు అనుమతులిచ్చే ముందు జరగని నీటి పరీక్షలు ప్రమాణాలకు పాతరేస్తున్న ప్లాంట్‌ నిర్వాహకులు ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు

జిల్లా వ్యాప్తంగా శుద్ధజలం సరఫరాపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆర్వో ప్లాంట్ల నాణ్యత ప్రమాణాలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రజలు రక్షిత నీటిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన జిల్లా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తనిఖీలు చేయాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో రక్షిత నీటి సరఫరా తీరుపై సాక్షి ప్రత్యేక కథనం.

జిల్లా జనాభా 18.73 లక్షలు

పురుషులు 9.40 లక్షలు

మహిళలు 9.33 లక్షలు

అర్బన్‌ జనాభా 3.69 లక్షలు

రూరల్‌ జనాభా 15.04 లక్షలు

జిల్లాలోని ఆర్వో ప్లాంట్‌లు 1,259

అనధికారిక ఆర్వో ప్లాంట్‌లు 2,158

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ల నిర్వహణపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరి, పూతలపట్టు, జీడీనెల్లూరులలో యథేచ్ఛగా ఆర్వోప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకపోవడంతో పలు ఆర్వో ప్లాంట్‌లు నిబంధనలకు పాతరేస్తున్నాయి. జిల్లాలోని ఆర్వో ప్లాంట్‌లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అయితే వీటిని పొందడానికి ముందు అధికారులు ప్లాంట్‌లను తనిఖీ చేయడం లేదు. అనుమతి ఉన్న వాటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం లేదు. దీంతో ప్రై వేట్‌ ప్లాంట్‌ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పంపిణీ చేస్తున్న నీటిలో వందశాతం నాణ్యతను పాటించడం లేదు.

వ్యాధుల బారిన ప్రజలు

ఆర్వో ప్లాంట్‌ల అలసత్వం వల్ల ప్రజలు అధిక శాతం డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ, నగరపాలక, పంచాయతీలలో ఉచితంగా సరఫరా చేస్తున్న కొళాయిల నీటి కంటే ఆర్వో ప్లాంట్‌ల నీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ప్లాంట్‌లో సరఫరా అయ్యే నీటినే సురక్షిత నీటిగా భావిస్తున్నారు. వారి నమ్మకాన్ని అవకాశంగా తీసుకుంటున్న పలువు రు ఆర్వో ప్లాంట్‌ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా అమ్మకాలు జరుపుతున్నారు. నేరుగా బోర్ల నుంచి తోడిన నీటినే పట్టి ఇచ్చేస్తున్నారు. కొన్ని ప్లాంట్‌ల వద్ద అక్కడే మురుగు నీరు ఉంటోంది. కనీస శుభ్రత సైతం ఉండటం లేదు. మరికొన్ని ప్లాంట్‌లు అతినీలలోహిత (యూవీ) విధానం సరిగ్గా పనిచేయకుండా నడిపేస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజారోగ్యం పై అధిక ప్రమాదం చూపుతున్నాయి.

శాంపిల్‌ పంపడం ఓ ప్రయాసే..

రాష్ట్ర వ్యాప్తంగా ఆహార నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌ లు లేవు. దీంతో ఇక్కడ సేకరించే శాంపిల్స్‌ ను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌ కు పంపాల్సి ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఖర్చుతో పాటు వ్యయప్రయాసలకు గురి చేస్తుండటంతో వీలైనంత వరకు అధికారులు శాంపిళ్లను తీయడం మానేస్తున్నారు. నిర్ధేశిత ఫీజుతో పాటు వారి వద్ద ఉన్న ఇతర అనుమతులను బట్టి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ధ్రువపత్రం ఇచ్చేస్తున్నారు.

అనుమతులు ఇలా..

జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా వీధికొక్కటి వాటర్‌ ప్లాంట్‌ ఉంది. వివిధ రకాల అనుమతులతో నడిచేవి కొన్నయితే, ఎటువంటి అనుమతి తీసుకోకుండా తాగునీటి వ్యాపారం చేసే ప్లాంట్లకు కొదవేలేదు. వీటి ఏర్పాటుకు ముందు స్థానిక సంస్థలు, లీగల్‌ మెట్రాలజీ, ఆహార భద్రత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్లాంట్లకు చెందిన బోరు, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని స్థానిక సంస్థలు అనుమతి ఇవ్వాలి. నిబంధనలను అనుసరించి తగిన పరిమాణంలో నీటిని అందించేందుకు పరికరాలు ఉండేలా లీగల్‌ మెట్రాలజీ చూడాలి. తాగేందుకు సురక్షితంగా నీరు ఉండేలా ఆహార భద్రతా ప్రమాణాల శాఖ పరిశీలించాలి. అన్నీ సక్రమంగా ఉన్న ప్లాంట్లకే అనుమతి ఇవ్వాలి. తరచూ తనిఖీలు చేపట్టాలి. ఇవేమి చూడకుండానే సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఇచ్చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

రక్షిత నీరు సందేహమే!

ఉండాల్సిన ప్రమాణాలు

ఆర్వో ప్లాంట్‌ నుంచి సరఫరా చేసే నీళ్లల్లో 500– 22000 మధ్య టీడీఎస్‌ (లవణాలు), 6.5–8.5 మధ్య పీహెచ్‌ (ఆమ్ల, క్షార గుణం), 1–1.5 లీటర్‌ నీటిలో మిల్లీగ్రాం ఫ్లోరైడ్‌, 0–45 నైట్రేట్‌, 0.3–1.0 ఐరెన్‌, 75–200 కాల్షియం, 30–100 మెగ్నీషియం, 200–400 సల్ఫేట్‌, 250–1000 క్లోరైడ్‌లు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే మించితే రక్తపోటు, కిడ్నీ సమస్య, జీర్ణకోశ వ్యాధులు, ప్లోరోసిస్‌, పిల్లల్లో బ్లూబేబి సిండ్రోమ్‌, కడుపులో మంటలు తదితర అనారోగ్య సమస్య లు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.

నిఘా లోపం

అనుమతులు ఇచ్చిన తరువాత సంవత్సరాల పొడవునా అధికారులు వాటి వైపు కన్నెత్తి కూ డా చూడటం లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉండటం కారణంగా ఆర్వో ప్లాంట్‌ల నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఫుడ్‌ సేప్టీ అధికారి తనిఖీకి వస్తే స్థానిక సంస్థల అధికారులు, లీగల్‌ మెట్రాలజీ అధికారులు కనిపించరు. వీరొస్తే ఫుడ్‌సేఫ్టీ అధికారి రారు. తనిఖీలకు వచ్చే అధి కారులు వివిధ ధ్రువపత్రాలను అడుగుతు న్నారు. లేవంటే సంబంధిత పత్రాలను పొందాలని చెప్పి ముడుపులతో సరిపెట్టేసుకుంటునారనే విమర్శలు ఉన్నాయి. అంతే తప్ప నిబంధనలు పాటిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగా నడుపుతున్నారా? అనే విషయాలను ఏ మాత్రం పరిశీలించడం లేదు. ఈ ఆర్వో ప్లాంట్‌ల తతంగంపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

శుద్ధ అబద్ధం 
1
1/1

శుద్ధ అబద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement