సతీష్‌కుమార్‌కు చిత్తూరు ఏఆర్‌తో అనుబంధం | - | Sakshi
Sakshi News home page

సతీష్‌కుమార్‌కు చిత్తూరు ఏఆర్‌తో అనుబంధం

Nov 15 2025 7:09 AM | Updated on Nov 15 2025 7:19 AM

చిత్తూరు అర్బన్‌: టీటీడీ పరకామణి కేసులో కీలక అధికారిగా ఉన్న వై సతీష్‌కుమార్‌ మృతితో చిత్తూరు పోలీసుశాఖలో ఆర్ముడు రిజర్వు (ఏఆర్‌) విభాగంలోని పలువురు సీనియర్లకు మాట రావడంలేదు. అసలు సతీష్‌ కుమార్‌ చని పోయింది వాస్తవమేనా..? అంటూ స్నేహితులకు ఫోన్లు చేసి కనుక్కుంటూ.. తీరా ఆయన మరణ వార్త తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తాడిపత్రిలోని కోమలి రైల్వేట్రాక్‌పై సతీష్‌కుమార్‌ మృతదేహం లభించడం తెలిసిందే. పదేళ్ల క్రితం సతీష్‌ కుమార్‌ చిత్తూరు ఏఆర్‌ విభాగంలో విధుల్లోకి చేరారు. పోలీసుశాఖ ఎస్‌ఐ పోస్టు సాధించిన తరువాత సతీష్‌కుమార్‌కు చిత్తూరు ఏఆర్‌లో తొలి పోస్టింగ్‌ లభించింది. దాదాపు రెండున్నరేళ్లకు పైగా ఆయన చిత్తూరులో ఆర్‌ఎస్‌ఐగా పనిచేశారు. పీఎస్‌ఓలకు ఇన్‌చార్జ్‌గా, స్పెషల్‌ పార్టీకి పర్యవేక్షణ అధికారిగా, కంపెనీ (ప్రత్యేక పోలీసు విభాగం)కు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. తన కిందిస్థాయి కానిస్టేబుళ్లను అన్నా, అన్నా అంటూ ఆప్యాయంగా పిలవడం.. సహచరులతో ఎప్పుడూ చలాకీగా, చనువుగా ఉండడం సతీష్‌కుమార్‌ నైజం. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సతీష్‌కుమార్‌కు చిత్తూరులో తొలి పోస్టింగ్‌ లభించడంతో ఇక్కడి పోలీసుశాఖలోని వందలాది మంది ఏఆర్‌ సిబ్బందితో ఆయనకు పరిచయాలున్నాయి. చిత్తూరుకు చెందిన పలువురు పోలీసులు సామాజిక మాధ్యమాల్లో సతీష్‌ కుమార్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టారు.

ఎస్పీడీసీఎల్‌లో పలువురికి ఉద్యోగోన్నతులు

తిరుపతి రూరల్‌ : ఏపీఎస్పీడీసీఎల్‌లో పలువురికి ఉద్యోగోన్నతులు కల్పిస్తూ సీఎండీ శివశంకర్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈఈ సోమశేఖర్‌రెడ్డిని ఎస్‌ఈగా, డీఈఈ చంద్రనాయక్‌ను ఈఈగా, అకౌంట్‌ ఆఫీసర్లు శ్రీధర్‌, నరేంద్రనాయుడును సీనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్లుగా ప్రమోషన్‌ ఇచ్చారు. అలాగే 25 మంది ఏఈఈలకు డీఈఈలుగా, ఏడుగురు అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్లకు అకౌంట్‌ ఆఫీసర్లుగా, 19 మంది జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్లకు అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తిరుమలలో రోడ్డు ప్రమాదం

తిరుమల : తిరుమల గోగర్భం డ్యామ్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు.. తిరుమలకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంలో వెళుతుండగా కారు ఢీకొంది. క్షతగాత్రుడిని అశ్వని ఆస్పత్రికి తరలించారు.

సతీష్‌కుమార్‌కు చిత్తూరు ఏఆర్‌తో అనుబంధం 
1
1/1

సతీష్‌కుమార్‌కు చిత్తూరు ఏఆర్‌తో అనుబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement