
మొక్కుబడిగా పెట్టుబడీదారుల సదస్సు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి తాజ్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు (రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్) మొక్కుబడిగా సాగింది. ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట హాజరయ్యారు. కాగా వేదికపై ప్రత్యేకంగా ఆహ్వానించిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల ప్రసంగాలకే అధిక సమయం కేటాయించారు. మధ్యాహ్న భోజన సమయంలో పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగంలో పర్యాటక రంగ అభివృద్ధి, అవకాశాలు, ప్రభుత్వం అందించనున్న ప్రోత్సాహాన్ని వివరించే ప్రయత్నం కాస్త పక్కదారి పట్టింది. వినేవారు లేకపోవడంతో ఇన్వెస్టర్స్తో, హోమ్ స్టే ఆపరేటర్స్తో ప్రత్యేకంగా మాట్లాడుతామంటూ కార్యక్రమాన్ని మమ అనిపించారు. అనంతరం కూటమి నాయకులు మంత్రిని సన్మానించేందుకు అత్యుత్సాహం చూపారు. సన్మాన, సత్కారాల అనంతరం మీడియా ముందుకు మంత్రి కందుల దుర్గేష్ వచ్చారు. ఏపీలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం, ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. కూటమి పాలనలో పర్యాటక రంగానికి ఏమి చేస్తామనే అంశాలను దాటవేస్తూ గత వైఎస్సార్సీపీ పాలనలో పర్యాటక రంగం అభివృద్ధి జరగలేదనే విష పూరిత వ్యాఖ్యలతో ప్రభుత్వ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఆహ్వానం లేదంటూ సీఆర్ రాజన్ మండిపాటు
రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ఆ శాఖ అధికారుల పిలుపు మేరకు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు హాజరయ్యారు. వారందరిని ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించారు. అయితే అక్కడే ఉన్న రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్ను పిలువలేదు. దీంతో ఆయన తీవ్ర మసస్తాపానికి గురయ్యారు. ఇతరులు చెబితే తెలుసుకుని ఇక్కడికి వస్తే ప్రొటోకాల్ మేరకు పిలవాలనే జ్ఞానం లేదా అంటూ ఆయనకు ఎదురుపడ్డ జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో పాటు ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానంటూ మండిపడ్డారు. ఆహ్వానించడం అనే విషయం తన పరిధిలో కాదని తన పై అధికారులంటూ నచ్చజెప్పే ప్రయత్నం జనార్దన్ రెడ్డి చేశారు. అయితే సీఆర్ రాజన్ ఆ మాటలు పట్టించుకోకుండా తనతో వచ్చిన అనుచరులతో బయటకు వెళ్లిపోయారు.