
16 నుంచి అప్పలాయగుంట పవిత్రోత్సవాలు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీవాణి తెలిపారు. దోషాల నివృత్తితో ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. 16న అంకురార్పణ, 17న పవిత్ర ప్రతిష్ట, 18న పవిత్ర సమర్పణ, 19న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. పవిత్సోవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
మందులు, మాత్రలపై విచారణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మందులు, మాత్రల కొరతపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సాక్షి దినపత్రికలో గురువారం ‘మందుల్లేవ్’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి మందులు, మాత్రల కొరతపై ఆరా తీశారు. పలు పీహెచ్సీ డాక్టర్లను విచారించారు. స్టాక్ విషయాలను తెలుసుకున్నారు. లేని మందులు, మాత్రల వివరాలను తెలుసుకుని డ్రగ్స్స్టోర్కు నివేదికలు పంపారు. అలాగే డ్రగ్స్స్టోర్కు సైతం లోటును భర్తీ చేశారు.
కళా ఉత్సవ్లో ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : కళా ఉత్సవ్ పోటీల్లో డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటినట్టు ఆ కళాశాల హెచ్ఎం హసన్బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11, 12 తేదీల్లో కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలలో జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న తమ పాఠశాల విద్యార్థులు 2 డీ డ్రాయింగ్ వ్యక్తిగత విభాగంలో మితేష్, జంబూ వాయిద్యంలో మల్లేష్ కుమార్లు ప్రతిభచాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వెల్లడించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన గైడ్ టీచర్ పాపయ్యను, గెలుపొందిన విద్యార్థులను అభినందించారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
చిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లలో ఇందుకోసం ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేశామన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారమే లక్ష్యంగా అదాలత్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రాజీ చేసుకోదగ్గ కేసులను అదాలత్లో పరిష్కరించుకోవచ్చన్నారు.
మరోమారు గడువు పొడిగింపు
చిత్తూరు అర్బన్: జిల్లాలో మద్యం బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగిస్తున్నట్టు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధిరాని శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరులో 5, పలమనేరులో ఓ బార్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తొలుత ఈనెల 14 వరకు గడువు విధించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాకపోవడంతో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించడానికి ఈనెల 18వ తేదీ ఉదయం 8 గంటలకు చిత్తూరు కలెక్టరేట్లో లక్కీడిప్ నిర్వహిస్తామన్నారు.
వైభవం.. విమానోత్సవం
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్ధి బుద్ధి వినాయకస్వామి విమాన సేవను నేత్ర పర్వంగా జరిపించారు. వేకువజామున మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం, అలంకరణ చేశారు. రాత్రి అలంకార మండపంలో ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం చేశారు. ప్రత్యేక పూజలనంతరం ఊరేగింపుగా విమాన వాహన సేవపై కొలువుదీర్చారు. తర్వాత విమానసేవ కన్నుల పండువగా సాగింది.

16 నుంచి అప్పలాయగుంట పవిత్రోత్సవాలు