
కుంటలో పడి చిరు వ్యాపారి మృతి
బంగారుపాళెం: మండలంలోని 65 వెంకటాపురం సమీపంలో సోమవారం కుంటలో పడి చిరువ్యాపారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు పట్టణం మంగసముద్రం హౌసింగ్ కాలనీకి చెందిన ముస్తఫా(44) పాతసామాన్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వ్యాపారం కోసం స్కూటీపై బంగారుపాళెం మండలానికి వచ్చాడు. మంగళపల్లె పంచాయతీ 65 వెంకటాపురం –సంక్రాతిపల్లె రహదారి పక్కన గల నీటి కుంటలో ద్విచక్ర వాహనంతో పాటు పడి మృతి చెందాడు. ఈ విషయాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తిని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
డబ్బు వసూలు చేయడం అన్యాయం
చిత్తూరు కలెక్టరేట్ : పీసీఆర్ పాఠశాలలో విద్యార్థుల వద్ద టీసీ మంజూరుకు డబ్బు వసూలు చేయడం అన్యాయమని ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు కందాటి విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీసీ మంజూరుకు డబ్బులు వసూలుకు పాల్పడటం బాధాకరమన్నారు. టీసీ కోసం వచ్చే విద్యార్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం నేరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తప్పిపోయిన వ్యక్తి ప్రత్యక్షం.. ఆపై మాయం
పలమనేరు: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి ప్రత్యక్షమై.. మళ్లీ కనిపించకుండా పోయిన ఘటన ఆదివారం పలమనేరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని బోయవీధికి చెందిన అస్లాం 15 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. అప్పట్లో కుటుంబీకులు వెదికినా దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని వినాయక నిమజ్జనంలో అతను ఉన్న ఓ వీడియో లోకల్ యూట్యూబ్ చానెల్లో కనిపించింది. అతన్ని గుర్తుపట్టిన కుటుంబీకులు సంతోషంతో అక్కడికెళ్లి చూడగా ఆ ప్రాంతంలో అతను కనిపించలేదు. అతను పట్టణంలోనే ఉన్నాడని భావించి గాలించడం మొదలు పెట్టారు.
సరెండర్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందిపై ఫిర్యాదులు వెలువెత్తడంతో కలెక్టరేట్కు సరెండర్ చేశారు. ఇటీవల చేపట్టిన ఏఎన్ఎంల బదిలీల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ సిబ్బందిపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిగింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టి కలెక్టరేట్కు సరెండర్ చేసినట్టు డీఎంఅండ్హెచ్ సుధారాణి తెలిపారు. అలాగే అక్రమ లింగనిర్థారణ విషయంలో చేతులు కలిపిన ఆశ వర్కర్ను కూడా సస్పెండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
టపాకాయలు సీజ్
పెనుమూరు(కార్వేటినగరం): అక్రమంగా తరలిస్తున్న రూ.1.6 లక్షల విలువ జేసే టపాకాయాలు సీజ్ చేసిన ఘటన చిత్తూరు–పెనుమూరు రోడ్డు మార్గంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనరసింహ కథనం... పెనుమూరు–చిత్తూరు మార్గంలో సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా పీలేరుకు చెందిన కె.నవ్యకాంత్ ఏపీ 39 టీహెచ్1738 నంబరు గల టెంపో వాహనంలో రూ.1.6 లక్షల విలువ జేసే టపాకాయలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో వాహనాన్ని అందుపులోకి తీసుకుని, టపాకాయలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

కుంటలో పడి చిరు వ్యాపారి మృతి

కుంటలో పడి చిరు వ్యాపారి మృతి