
ఎర్రమట్టి..కొల్లగొట్టి!
యథేచ్ఛగా తరలిస్తున్న గ్రావెల్ మాఫియా తమిళనాడులో ఒక్కో టిప్పర్ రూ.30 వేల నుంచి రూ.40 వేలు కరిగిపోతున్న గుట్టలు ఆలస్యంగా స్పందించిన అధికారులు 9 టిప్పర్లు, 2 హిటాచీలు సీజ్
పాలసముద్రం: మండలంలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు కొల్లగొడుతోంది. అందినకాడికి ఎర్ర గావెల్ను తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. దీనిపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి అండతో మరింత రెచ్చిపోతోంది. మండలంలోని వనదుర్గాపురం రెవెన్యూ లేక్కదాఖాల జగనన్న కాలనీ సమీపంలోని గుట్టపై కన్నేసింది. తలసిందే తడువుగా హిటాచీలు దించేసింది. పదుల సంఖ్యలో ఎర్రగ్రావెల్ను నింపి లారీలను సరిహద్దు దాటించింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే!
మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీకి ఆనుకుని గుట్టలున్నాయి. ఇవి తమిళనాడు హైవేకి కిలో మీటరు దూరంలో ఉండడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ గుట్టల్లోని విలువైన ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. గ్రావెల్, మట్టిని తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులో ఒక్కో టిప్పర్ గ్రావెల్ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోరే?
తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఇదే అదునుగా అక్రమార్కులు అందినకాడికి అడ్డంగా తోడేస్తున్నారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులకు ఎదురు లేకుండా పోతోంది. మండలంలోని గుట్టలు, కొండలను కరింగించేస్తున్నారు. గతంలో అనుమతి లేకుండా ఎర్రమట్టి తీసుకెళ్తున్న టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. వాటిని రెండు రోజుల క్రితమే అక్రమార్కులు పన్నులు చెల్లించి తీసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు వనదుర్గాపురం పంచాయతీ, జగనన్న కాలనీ సమీపంలోని గుట్టలో తవ్వకాలు ప్రారంభించారు. తమకడ్డొచ్చిన అధికారులను కూడా బెదిరించినట్టు సమాచారం.
వాహనాలు సీజ్
వనదుర్గాపురం గుట్టలో ఎర్రమట్టి తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి, ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తవ్వకాలు, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడంతో తొమ్మిది టిప్పర్లు, రెండు హిటాచీలను సీజ్ చేశారు. తమిళనాడు టిప్పర్లకు అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని ఎస్ఐ తెలిపారు.