
ఐదుగురు జూదర్ల అరెస్టు
చౌడేపల్లె: మండలంలోని పెద్దకొండామర్రి చెరువు కింద గల పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. రహస్య సమాచారం మేరకు సిబ్బందితో కలసి పేకాట స్థావరంపై దాడులు చేయగా కేశవరెడ్డి, శ్రీనివాసులు, ముకుంద, లక్ష్మన్న, సహదేవను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,100 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తపాలా బీమా ఏజెంట్ల
ఎంపికకు ఇంటర్వ్యూలు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని తపాలాశాఖ పరిధిలో బీమా ఏజెంట్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. పదో తరగతి పాసై 18 ఏళ్లు దాటిన వారు ఇందుకు అర్హులన్నారు. తపాలా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలను బుక్ చేయాలన్నారు. ఆసక్తిదారులు జూలై 5వ తేదీ లోపు కార్యాలయ పనివేళల్లో చిత్తూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
బంగారుపాళెం: విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మ హిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువా రం మృతి చెందినట్లు ఏఎస్ఐ రామచంద్రారెడ్డి తెలిపారు. ఏఎస్ఐ కథనం మేరకు.. పలమనేరు మండలం జగమర్ల గ్రామానికి చెందిన సుధాకర్, అతని భార్య పల్లవి బంగారుపాళెం మండలం నలగాంపల్లెకు చెందిన శ్యామల మామిడితోటలో కాపలాగా ఉన్నారు. ఈ నెల 22న భర్త సుధాకర్ మద్యం సేవించి రావడంతో భార్య పల్లవి ప్రశ్నించింది. ఈ విషయంపై భార్య, భర్త గొడవలు పడ్డారు. దీంతో సుధాకర్ మొదట విషం తాగాడు, భయపడిన పల్లవి కూడా విషం తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు భార్యాభర్తలను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. భర్త సుధాకర్ కోలుకోగా, భార్య పల్లవి(23) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.