
రోడ్డు ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
ఐరాల: రోడ్డు ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మండలంలోని ఎం.పైపల్లె వద్ద గురువారం చోటు చేసుకుంది. కాణిపాకం ఇన్చార్జి ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని మామిడిగుంట్లపల్లెకు చెందిన ఏ.ప్రకాష్(42) కాణిపాకం ఆలయంలో ఔట్ సోర్సింగ్ హెల్పెర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో చిత్తూరుకు సొంత పనుల నిమిత్తం బయలుదేరాడు. మండలంలోని చిన్నవెంకటంపల్లెకు చెందిన నరసింహారెడ్డి ఓ కారులో చిత్తూరు నుంచి ఐరాల వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డి అతివేగంగా కారు నడుపుతూ ఎం.పైపల్లె వద్ద ద్విచక్రవాహనంలో వెళుతున్న ప్రకాష్ను కారుతో ఢీకొన్ని, వెనుక వస్తున్న ఆటోను ఢీకొన్ని కొంత దూరం కారుతో లాక్కొని వెళ్లి ఓ చెట్టుకు ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఆటోలో ఉన్న మండలానికి చెందిన జుబేరా కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను ఓ ప్రైవేటు వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రకాష్ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం జుబేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టమ్ అనంతరం ప్రకాష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి మురగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాష్ మృతికి కాణిపాకం ఆలయ సిబ్బంది ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.