
అంతా మా ఇష్టం!
● కుప్పం లైనింగ్ పనుల్లో రూ.169 కోట్ల పనులు ఆ ఇద్దరికే!
● ఇద్దరితో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ సాధ్యమా?
● ఏరికోరి వారినే నియమించిన ఉన్నతాధికారులు
మదనపల్లె: వడ్డించే వాడు మనోడైతే ఏ బంతిలో ఉన్నా కొరవుండదన్న సామెత హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగమైన చిత్తూరు జిల్లా కుప్పం ఉపకాలువ లైనింగ్ పనులకు అతికినట్టు సరిపోతుంది. ఈ లైనింగ్ పనులు చేపట్టింది అనకాపల్లె ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ, అందులోనూ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఇక చెప్పేదేముంటుంది. ఎవరెమనుకున్నా సరే మనోళ్లు, మనం చెప్పినట్టు వినేవాళ్లకు పనులు అప్పగిస్తే..ఇక అడ్డు అదుపు ఉండదనుకున్నారేమో.. సరిగ్గా అదే జరిగింది. రూ.169 కోట్ల విలువైన పనులను చూసే బాధ్యతను కేవలం ఇద్దరంటే ఇద్దరే అధికారులకు అప్పగించి, ఉన్నతాధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. అంతటిలో ఆగలేదు..మీ పనులు మీ ఇష్టం అన్నట్టుగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చేశారన్న విమర్శలు వినిస్తున్నాయి.
డివిజన్ అధికారిని తప్పించేసి..
హంద్రీనీవా ప్రాజెక్టు సబ్ డివిజన్ కేంద్రం కుప్పంలో ఉంది. దీనికి సెల్వరాజ్ డీఈగా స్థానికంగా ఉండి పని చేస్తున్నారు. వాస్తవానికి కుప్పం ఉపకాలువ లైనింగ్ పనుల్లో ఈయన కీలకంగా పని చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థకు నచ్చలేదో లేక చెప్పినట్టు పని చేయరని అనుకున్నారో కాని కుప్పం లైనింగ్ పనుల బాధ్యత వహించాల్సిన సెల్వరాజ్కు ఒక్కశాతం బాధ్యత లేకుండా పూర్తిగా తొలగించి, పక్కన పెట్టారు. అయితే పూర్తిగా బాధ్యతలు అప్పగించకపోతే వివాదం రేగుతుందని అనుకున్నారేమో ఆయనకు చిత్తూరు జిల్లాలో పని కల్పించకుండా అన్నమయ్యజిల్లాలో జరుగుతున్న పుంగనూరు ఉపకాలువ పనుల్లో 12 కిలోమీటర్ల బాధ్యతలను అప్పగించి చేతులు దులుపుకున్నారు.
అంతా ఆ ఇద్దరికే..
రూ.169 కోట్ల విలువ కలిగిన 90 కిలోమీటర్ల కాలువ పనులు..అందులో లైనింగ్, షార్ట్ క్రీటింగ్ పనులు కీలకమైనవి. అయితే ఉన్నతాధికారుల కనుసన్నల్లో పనుల అప్పగింత వ్యవహారం సాగింది. పీబీసీ పనుల్లో ఐదుగురు డీఈఈలను నియమిస్తే..కుప్పం పనులకు అంతేమందిని నియమించాలి. అయితే ఇక్కడ నిబంధనలు పని చేయలేదు. డీఈ సెల్వరాజ్ను తప్పించాక..ఏరికోరి ఇద్దరికి బాధ్యతలు ఇచ్చారు. 90 కిలోమీటర్ల కాలువ పనులకు ఒకే ఒక్క డీఈగా గోవర్దన్ను, ఒకే ఒక్క ఈఈగా వెంకటేశ్వర్లును నియమించారు. ఎక్కువ మంది ఉండాల్సిన జేఈల సంఖ్య కేవలం నాలుగుకే పరిమితం చేశారు. మిగిలిన ఎవరికీ ఈ పనుల్లో భాగస్వామ్యం కానీ, బాధ్యతలు కానీ అప్పగించకుండా దూరంగా ఉంచేశారు. కుప్పం లైనింగ్ పనులకు ఒక ఈఈ, ఒక డీఈకే పూర్తి కాలువ బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులు మరి పుంగనూరు ఉపకాలువ విషయంలో అలా వ్యవహరించలేకపోడం వెనుక కారణాలేమిటన్నది చర్చనీయాంశమైంది. ఇక్కడ ఐదుగురు డీఈలకు బాధ్యతలు ఇస్తే..90 కిలోమీటర్లకు ఒకే డీఈకి ఎలా బాధ్యత ఇచ్చారో..ఒక్కరే ఇంత పని ఎలా నిర్వహిస్తారని ఉన్నతాధికారులు భావించారో అర్థంకాని వ్యవహారంగా మారింది. పీబీసీ పని నామినేషన్పై అప్పగిస్తే..కుప్పం పనిని టెండర్ ద్వారా రెండు రీచ్లుగా పనులు చేపట్టారు. ఇలా అయినా కనీసం ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈలైనా ఉండాలి. అలా కూడా లేకుండా ఒక్క డీఈనే నియమించారు.
పనులపై అనుమానాలెన్నో
కుప్పం ఉపకాలువలో
జరుగుతున్న లైనింగ్ పనులు
కేబీసీ లైనింగ్ పనులివీ..
కుప్పం ఉపకాలువ(కేబీసీ)లో లైనింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాక రెండు కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాల్గొనగా అందులో రిత్విక్ ప్రాజెక్ట్ సంస్థ అదనంగా టెండర్ దాఖలు చేయడంతో ప్రభుత్వం దాన్నే ఖరారు చేసి పనులు అప్పగించింది. రెండు రీచ్లుగా నిర్ణయించిన ప్రభుత్వం రూ.169,80,935తో 90.393 కిలో మీటర్ల కాలువకిరువైపులా సిమెంట్ లైనింగ్, అందులో 26.391 కిలోమీటర్లు షార్ట్ క్రీటింగ్ పనులు పూర్తి చేయాలి. మిగిలిన 64.002 కిలోమీటర్లు లైనింగ్ చేయాలి. ఈ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయించాలన్నది లక్ష్యం. ఇందుకోసం పూర్తిస్థాయి సాంకేతిక అధికారులను నియమించి, పర్యవేక్షణ, నాణ్యతా ప్రమాణాల పాటింపు, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. అంటే ఇందుకు తగినంతమంది అధికారులను నియమించాలి. అయితే ఇక్కడ నిక్కచ్ఛిగా పనిచేసే అధికారులు అవసరం లేదనుకున్నారు. అంతే అయినవారికి పనులు అప్పగించేశారు.
కుప్పం ఉప కాలువ పనులను 2015లో చేపట్టిన అప్పటి టీడీపీ ప్రభుత్వం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట సంస్థలోకి సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కాంట్రాక్టు సంస్థకు భాగస్వామ్యం కల్పించడంతో పనుల వ్యవహారం అస్తవ్యస్తంగా మారడమే కాకుండా రూ.122 కోట్లను అదనం పేరుతో దోపిడీ చేశారు. ఈ పరిస్థితుల్లో లైనింగ్ పనుల కాంట్రాక్టు రిత్విక్ సంస్థకు దక్కడంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనుల పర్యవేక్షణ కేవలం ఒక డీఈకే అప్పగించడం, వాటి వివరాల నమోదు, నాణ్యత పరిశీలన తదితర అంశాల్లో పారదర్శకంగా సాగడం లేదన్న వాదన వినిపిస్తోంది.
పది మంది జేఈలు
కుప్పం లైనింగ్ పనులకు ఒకే డీఈ, ఒకే ఈఈకి అప్పగించడం, కేవలం నలుగురు జేఈలే ఉన్నారన్న అంశంపై ప్రాజెక్టు ఎస్ఈ విఠల్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. పది మంది జేఈలు పని చేస్తున్నారని చెప్పారు. పనులను పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు.