
పర్యవేక్షణ కరవు
తొలిబడి అమ్మ అయితే.. మలిబడి అంగన్వాడీ కేంద్రాలే. పిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలి. అయితే అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదు. నాణ్యమైన ఆహారం అందజేస్తున్నామ ని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మా త్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన కందిపప్పును గ ర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నారు. ఈ నాసిరకం కందిపప్పునే అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు వండి పెడుతున్నారు.
నగరి: నగరి ఐసీడీఎస్ పరిధిలో 202 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 161 మెయిన్, 41 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. ఈ సెంటర్లకు నగరి సివిల్ సప్లయిస్ గోదాము నుంచే సరుకులు సరఫరా చేస్తారు. గోదాముకు వచ్చి చేరిన సరుకే నాసిరకంగా ఉంటోంది. దానినే మూడు మండలాల అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. ఈ పురుగులు పట్టిన పప్పునే నిండ్ర మండలం అత్తూరు గ్రామ అంగన్వాడీ కేంద్రలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసేశారు. పురుగులు పట్టిన పప్పు చూసుకున్న వారు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీ చేయాల్సినవారు కాసులకోసం కక్కుర్తిపడి అడ్డదారులు తొక్కుతున్నారంటూ ఆరోపించారు.
సరఫరా ఆపేయమన్నాం
వచ్చిన కందిపప్పు నాసిరకంగా ఉండడంతో సీడీ పీఓ గోదాము డీటీని సంప్రదించారని, అలా ఉంటే పప్పు పంపిణీ చేయొద్దని, వాపసు పంపేస్తే వేరే పప్పు ఇస్తామన్నారని సూపర్వైజర్ శంకరమ్మ తెలిపారు. దీంతో అందరికీ సరఫరా చేయవద్దని ఆదేశాలు కూడా ఇచ్చామన్నారు. నగరి, విజయపురం మండలాల్లో పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదన్నా రు. అయితే విషయం తెలియక నిండ్ర మండలం అ త్తూరు అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చేశారన్నా రు. సరఫరా ఆపేయమని వారికి సూచించామని త్వరలో వేరే సరకులు ఇస్తామని ఆమె తెలిపారు.
అంగన్వాడీలకు గోదాము అధికారుల సూచన
చిన్నారులకు.. నాణ్యత లేని ఆహారం
అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం కంది పప్పు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గర్భిణులు, బాలింతలు
‘జల్లించి, ఎండలో వేసి, వండి పెట్టేయండి.. ఏమీ కాదు’ అని నాసిరకం కందిపప్పు సరఫరా చేయడంపై ప్రశ్నించిన అంగన్వాడీ కార్యకర్తకు సివిల్ సప్లయిస్ గోదాము అధికారులు చేసిన సూచనలివి. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడేలా గోదాము అధికారులు నిర్లక్ష్యపు సమాధానమివ్వడంతో నిండ్ర మండలం, అత్తూరు అంగన్వాడీ కేంద్రం కార్యకర్త నివ్వెరపోయారు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సరుకుల పంపిణీ దారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే పప్పును చెరిగితే సగానికి సగం వేస్టేజీ పోతుందని, పప్పు గింజల కంటే ఎక్కువగా పురుగులు ఉంటున్నాయన్నారు. దీనినే కేంద్రంలోని పిల్లలకు కూడా వండిపెడుతున్నారన్నారు. ఇప్పటికే విజయపురం పన్నూరు హాస్టల్లో 30 మందికిపైగా పిల్లలు అస్వస్థతకులోనై ఆస్పత్రి పాలయ్యారు. ఆ పరిస్థితి అంగన్వాడీ పిల్లలకు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అత్తూరు కేంద్రంలోనే ఆరుగురు గర్భిణులు ఉన్నారు. వారికేమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారని అంతా ప్రశ్నిస్తున్నారు.

పర్యవేక్షణ కరవు