
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో చోటు
చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి జిల్లాలోని పలువురికి చోటు కల్పిస్తూ..పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. చంద్రగిరికి చెందిన అన్వర్ బాషాను, శ్రీకాళహస్తికి చెందిన మహ్మద్ రసూల్ను రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శులుగా, నగరికి చెందిన మోహన్రెడ్డిని రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శిగా, చంద్రగిరికి చెందిన నాగేనమ్మను రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శిగా, నగరికి చెందిన గోపాల్రెడ్డిని రాష్ట్ర ఎంప్లాయిస్, పెన్షన్ విభాగ సహాయ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
దళితుల శ్మశానవాటిక ఆక్రమణ
– తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు
చౌడేపల్లె : మండలంలోని పెద్దయల్లకుంట్ల పంచాయతీ చిప్పిలివారిపల్లె దళితులకు చెందిన శ్మశానవాటిక (ఒలికిల గడ్డ) ఆక్రమణకు గురైందని గ్రామస్తులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన చిప్పిలి రెడ్డెప్ప అతని కుటుంబీకులు ట్రాక్టర్తో రాత్రి సమయంలో దున్నుతుండగా అడ్డుకోబోయిన వారిపై దౌర్జన్యం చేసి దున్నేశారని ఎర్రప్ప.. తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలిలా...ఒలికిలగడ్డలో కొన్నేళ్లుగా తమ పూర్వీకుల నుంచి నేటికీ అదే శ్మశాన వాటికలో ఖననం చేసేవాళ్లమన్నారు. 248/3 సర్వే నంబరులో 66 సెంట్ల స్థలంలో సమాధులున్నాయని, వాటిని రాత్రిపూట దున్నేయడంతో అధికారులను ఆశ్రయించామని చెప్పారు. శ్మశాన వాటిక స్థలం తమదని ఆక్రమణదారుడు చెప్పడంతో ఇన్నాళ్లు పొలంలోకి రాని అతను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై దాడికి యత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల సమాధులను దున్నేయడంతో పాటు బండరాళ్లను సైతం ధ్వంసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు.
సర్వదర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 20 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 74,344 మంది స్వామివారిని దర్శించుకోగా 32,169 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.