● ఈకేవైసీ గడువు పొడిగింపు ● జూన్‌ నెల ఆఖరు వరకు గడువు ● ఇప్పటికీ 1,05,185 మందికి పెండింగ్‌ ● వలస కూలీలు, ఉద్యోగులే పెండింగ్‌లో అధికం | - | Sakshi
Sakshi News home page

● ఈకేవైసీ గడువు పొడిగింపు ● జూన్‌ నెల ఆఖరు వరకు గడువు ● ఇప్పటికీ 1,05,185 మందికి పెండింగ్‌ ● వలస కూలీలు, ఉద్యోగులే పెండింగ్‌లో అధికం

May 1 2025 1:52 AM | Updated on May 1 2025 1:52 AM

● ఈకేవైసీ గడువు పొడిగింపు ● జూన్‌ నెల ఆఖరు వరకు గడువు ●

● ఈకేవైసీ గడువు పొడిగింపు ● జూన్‌ నెల ఆఖరు వరకు గడువు ●

కాణిపాకం: ఈకేవైసీ గడువు మళ్లీ పొడిగింపు జరిగింది. పేదలకు పరేషాన్‌ తీరింది. ఈ ప్రక్రియ గడువు బుధవారంతో ముగుస్తుందని టెన్షన్‌ పడిపోయారు. వచ్చే నెల నుంచి సరుకులు కట్‌ అనుకున్నారు. అయితే ప్రభుత్వం మళ్లీ ఈకేవైసీ గడువు జూన్‌ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో కార్డుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల మంది పైగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎక్కడైనా చేయించుకోవచ్చని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఫలితం శూన్యమవుతోంది. వలస కూలీలు, ఉద్యోగులు ఈకేవైసీ చేయించుకోవాల్సిన జాబితాలో అధికంగా ఉన్నారని అధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 1,339 రేషన్‌ దుకాణాల పరిధిలో 5.40 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. ఈ కార్డుల్లో 16,70,470 మంది సభ్యులున్నారు. పారదర్శకత పేరుతో జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ నవీకరిస్తున్నారు. మృతులు ఉండడంతోపాటు అనర్హులైన పలువురు ఉద్యోగులు రేషన్‌ పాందుతున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్‌ భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కార్డులో ఉన్న ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేసింది.

ఈకేవైసీ అధికంగా పెండింగ్‌ ఇక్కడే..

జిల్లాలో కుప్పం, వి.కోట, పలమనేరు, చిత్తూరు, నగరి, పుంగనూరు, రామకుప్పం తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అధిక శాతం మంది బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.

సరుకు రాదని..

గడువు ముగుస్తుండడంతో చాలా మంది కార్డుదారులు పనులు మానుకుని ఈకేవైసీ కోసం క్యూ కట్టారు. కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్‌ తదితర సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు పరుగు పరుగున వస్తున్నారు. మిగిలిన కొంత మంది అవగాహన లోపం కారణంగా రాలేకపోతున్నారు. ఒక రోజు పని వదులుకుంటే కష్టమని కొంతమంది, రాలేని పరిస్థితుల్లో మరికొంత ఉన్నారు. వీరికి ఉన్న చోటే ఈకేవైసీ చేసుకోవచ్చనే విషయం తెలిక ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వ్యక్తులు, బయట రాష్ట్రాల్లో చదివే కళాశాల విద్యార్థులు సైతం ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. వీరితోపాటు మృతులు, కదలేని వృద్ధులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కలిపి 75 వేల మందికి పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 0–5 పిల్లలు 26,628 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని గుర్తించారు. వీరిలో ఐదేళ్లు దాటిన పిల్లల తల్లిదండ్రులకు ఈకేవైసీ ప్రక్రియ తలనొప్పిగా మారింది. మండుటెండలో పిల్లలను వెంట పెట్టుకుని ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక ఎక్కడైతే రేషన్‌ తీసుకుంటున్నారో..ఆ ప్రాంతాల్లోనే ఈకేవైసీ చేయించుకోవాలని కొంత మంది డీలర్లు మెలిక పెడుతున్నారు.

రేషన్‌కు ప్రతి సభ్యుడికీ ఈకేవైసీ తప్పనిసరి మెలిక.. అదీ ఏప్రిల్‌ 30 వరకే గడువు.. ఆపై సరుకులు కట్‌.. వెరసి.. రేషన్‌కార్డులు పరేషాన్‌ కావాల్సిన పరిస్థితి. సుదూర ప్రాంతాల్లోని పిల్లలు.. కదలలేని వృద్ధులు.. వేలి ముద్రలు పడని చిన్నారులు ఏమి చేయాలని పేదలు ఖంగారు.. ఎట్టకేలకే మళ్లీ ఈకేవైసీ గడువు పొడిగింపుతో వారి పరేషాన్‌ తీరింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లా సమాచారం...

చౌకదుకాణాలు – 1,339

రేషన్‌కార్డుల సంఖ్య – 5.40 లక్షలు

కార్డులోని సభ్యులు – 16,70,470

ఈకేవైసీ చేయించుకున్నవారు – 15,37,402

పెండింగ్‌లోని 0–5 వయస్సుపిల్లలు – 26,628

80 ఏళ్లు దాటిన వృద్ధులు – 1,255

చేయించుకోవాల్సి వారు మొత్తం – 1,05,185

ఈకేవైసీ కొత్తకార్డులకు శాపమా?

ఈకేవైసీ ప్రక్రియను సాకుగా చూపి, కూటమి ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల మంజూరును వాయిదా వేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో కొత్త రేషన్‌కార్డులకు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రకటించింది. సంక్రాంతికి కొత్త కార్డులని, ఆ తర్వాత ఉగాదికని చెప్పింది. అప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో కూటమి నేతలు కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోలేక గుటకలు మింగుతున్నారు. ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ పొడిగింపుతో కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మళ్లీ నిరాశే మిగిలింది.

ఆందోళన వద్దు

ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జూన్‌ నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ విషయాన్ని గమనించి ఇంత వరకు ఈకేవైసీ చేయించుకోని వారు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డీలర్లు ఈప్రక్రియను పూర్తిచేసేలా చూడాలి. కార్డుదారులను ఇబ్బంది పెట్టవద్దు.

– శంకరన్‌, డీఎస్‌ఓ, చిత్తూరు

మార్చి నుంచి ప్రారంభం

ఈకేవైసీ ప్రక్రియ గత మార్చి 19వ తేదీ నుంచి అన్ని రేషన్‌ షాపుల్లో ప్రారంభమైంది. తొలుత మార్చి 23 వరకు గడువు పెట్టారు. ఆ తర్వాత నెలాఖరు వరకూ పొడిగించారు. అ ప్పటికీ ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన కార్డుదారులు పెద్ద సంఖ్యలో మిగిలిపోవడంతో ఈకేవైసీ గడువును ఏప్రిల్‌ 30 వరకు పొడిగించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 15, 37,402 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. మరో 1,05, 185 మంది ఈ ప్రక్రియ పూర్తి చేయించుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement