‘నీట్‌’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

May 1 2025 1:52 AM | Updated on May 1 2025 1:52 AM

‘నీట్‌’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

‘నీట్‌’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

● జిల్లాలో ఈ నెల 4న పరీక్ష ● కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఈ నెల 4వ తేదీన నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. జిల్లాలో ఈ పరీక్ష నిర్వహణపై బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నీట్‌ నిర్వహించాలన్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తుందని చెప్పారు. జిల్లాలోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. మే 4వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలను సంబంధిత అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు.

పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయండి

పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో, ప్రశ్నపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలీస్‌ల భద్రత నడుమ కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తరలించాలని చెప్పారు. పరీక్ష నిర్వహించే సమయంలో విద్యుత్‌ అంతరాయం కలగకుండా, మౌలిక వసతుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిర్దేశించిన ప్రాంతంలో తల్లిదండ్రులు వేచి ఉండేందుకు షామియానా, నీటి వసతులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సరైన సమయానికి చేరుకునేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విభిన్నప్రతిభావంతులకు వీల్‌చైర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర వైద్యసేవలకు అంబులెన్స్‌, ఫైర్‌ ఇంజిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్‌లు మొబైల్‌ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలన్నారు. మొబైల్‌ ఫోన్‌లు భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీసు తరపున ఒక నోడల్‌ అధికారిని నియమించాలని తెలిపారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను ఆర్ముడ్‌ పోలీసుల ఎస్కార్ట్‌తో పరీక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ చేయించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్‌, డీఈఓ వరలక్ష్మి, ఆర్డీఓ శ్రీనివాసులు, పీవీకేఎన్‌ కళాశాల పరీక్షల విభాగం కోఆర్డినేటర్‌ శరవణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement