
పన్ను వసూళ్లలో రాష్ట్రంలో రెండో స్థానం
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో పన్ను వసూళ్ల నందు రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సుధాకర్రావు తెలిపారు. గత బకాయిలతో కలిపి మొత్తం వార్షిక లక్ష్యం రూ.24.45 కోట్లు కాగా అందులో రూ.21.34 కోట్లు వసూళ్లు అయ్యాయన్నారు. ఇందులో పన్నుల లక్ష్యం రూ.17.41 కోట్లకుగాను రూ.14.85, పన్నేతరులు రూ.6.84 కోట్లకు గాను రూ.6.49 కోట్లు వచ్చిందన్నారు. మొత్తం లక్ష్యంలో 87 శాతం చేరుకున్నామన్నారు. పన్నుల లక్ష్యంలో పశ్చిమ గోదావరి జిల్లా 88 శాతం వసూళ్లతో మొదటి స్థానం కాగా చిత్తూరు జిల్లా 85 శాతంతో రెండో స్థానం వచ్చిందన్నారు. పన్నేతరులు లక్ష్యం మన జిల్లా 95 శాతం వసూళ్లు సాధించి మొదటి స్థానం రాగా విశాఖపట్నం 94 శాతం రెండో స్థానంలో నిలిచిందన్నారు. కాగా నవంబరు నుంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందుకు సహకరించిన కార్యదర్శులకు అభినందనలు తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరూ కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు.
3న ఇంటర్ మూల్యాంకనం పూర్తి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ ఈనెల 3వ తేదీతో ముగియనుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ డీవీఈఓ సయ్యద్ మౌలా వెల్లడించారు. ఈనెల 1వ తేదీ నాటికి 80 శాతం జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగిందన్నారు. మిగిలిన 20 శాతం జవాబు పత్రాలను ఈనెల 2, 3 తేదీల్లో పూర్తి చేస్తామన్నారు. దీంతో మూల్యాంకన ప్రక్రియ ముగుస్తుందని ఆయన తెలిపారు.
ఇన్చార్జిగా జేసీ విద్యాధరి
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా జేసీ విద్యాధరికి బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. నూతన పాలకవర్గం గ్రంథాలయం సంస్థకు ఏర్పాటయ్యే వరకు జేసీ పర్సన్ ఇన్చార్జిగా ఉంటారని ఆదేశించారు.
గిరింపేటలో రేషన్ పట్టివేత
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం గిరింపేటలోని రేషన్ షాపునకు ఎదుట ఉన్న ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆ షాపుపై దాడులు నిర్వహించారు. నిఘా పెట్టి ఆ ఇంట్లో తనిఖీలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన 120 కిలోల బియ్యం పట్టుకున్నారు. దీంతో అక్రమార్కులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు.
నేటి నుంచే స్లాట్ రిజిస్ట్రేషన్లు
చిత్తూరు కార్పొరేషన్ : ఆస్తి లావాదేవీల రిజిస్ట్రేషన్లకు ఇక స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిర్దేశించిన సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లాలోని ఆర్ఓ (జిల్లా కేంద్రంలోని అర్బన్ సబ్ రిజిస్ట్రార్) కార్యాలయంలో బుధవారం నుంచి ఈ ప్రకియ ప్రారంభించనున్నారు. నెలాఖరు లేదా మే నెల నాటికి దశల వారీగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి మంగళవారం సబ్రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్లతో సమావేశమై పలు అంశాల గురించి వారికి అవగాహన కల్పించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో 17 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్ : మద్యం తాగి వాహనాలు నడిపిన 17 మందికి రూ.1.70 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి మంగళవారం తీర్పు ఇచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 17 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.1.70 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

పన్ను వసూళ్లలో రాష్ట్రంలో రెండో స్థానం