గ్రామ కంఠం భూమి రిజిస్ట్రేషన్
● ఫోర్జరీ సంతకంతో కానిచ్చిన వైనం ● బాధితుడి ఫిర్యాదుతో కేసు ● నిందితుడు టీడీపీ నేత
గంగాధర నెల్లూరు : ఫోర్జరీ సంతకంతో గ్రామ కంఠం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని మహదేవ మంగళంలోని గ్రామ కంఠం భూమిని సర్వేయర్ గుణశేఖర్ సంతకం ఫోర్జరీ చేసి అధికారులను ఏ మార్చిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ శ్రీనివాసంతి వివరాల మేరకు.. మహాదేవ మంగళానికి చెందిన సోమాచారి కుమారుడు పట్టాభి ఆచారి తన భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని టీడీపీకి చెందిన నటరాజ మొదలి తన భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్ని అధికారులను తప్పుదోవ పట్టించి, బాధితుడు గుర్తించే లోపు ఆ భూమిని ఫోర్జరీ సంతకాలతో దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఈ అక్రమాలపై గంగాధర నెల్లూరు పోలీసులకు బాధితుడి ఫిర్యాదు మేరకు మహదేవ మంగళకు చెందిన నిందితులు ఏ–1గా ఎస్ఎస్ నటరాజ్ మొదలి, ఏ– 2గా శంకర్ రెడ్డి, ఏ–3గా రంగమ్మ, తవణంపల్లి మండలం, ఎంజీ పల్లికు చెందిన ఏ–4గా ఎన్. భాస్కర్, ఏ–5గా సుబ్రమణ్యం, ఏ – 6గా గంగాధర్రెడ్డి పై కేసు నమోదు చేసినట్ల తెలిపారు. విషయాన్ని గుర్తించిన బాధితుడు పట్టాభి ఆచారి గ్రామ సర్వేయర్ గుణశేఖర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మేసిన విషయాన్ని చిత్తూరు సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించి తనకు జరిగిన అన్యాయాన్ని, వాస్తవాలను వివరించారు. కాగా సబ్ రిజిస్ట్రార్ ఈ రెండు రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు బాధితుడికి తెలిపారు. బాధితుడు పట్టాభి ఆచారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చారి సీఐ శ్రీ నివాసంతి తెలిపారు.


