
తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వైపు సాగుతోంది. అయితే.. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో రూ. లక్ష కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, ఐదు లక్షల మందికి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ మినిష్టర్ 'దుద్దిల్ల శ్రీధర్ బాబు' (D. Sridhar Babu) అన్నారు. ఆస్ బయోటెక్ అండ్ విక్టోరియా ప్రభుత్వం సంయుక్తంగా మెల్బోర్న్లో నిర్వహించిన ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన 'రోడ్మ్యాప్ 2030'ను రూపొందించిందని ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు అన్నారు. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా ప్రపంచ భాగస్వామ్యాలను వేగవంతం చేయడానికి తెలంగాణ సమగ్ర లైఫ్ సైన్సెస్ విధానాన్ని సిద్ధం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గ్లోబల్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ (CBRE) నివేదిక గురించి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో - బోస్టన్, శాన్ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యోలతో పాటు.. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025లో హైదరాబాద్ కూడా స్థానం సంపాదించింది అన్నారు.
బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్కేర్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల అవసరాలను తీర్చడానికి "రెడీ-టు-డిప్లాయ్ బయో డిజిటల్ వర్క్ఫోర్స్"ను నిర్మించడంలో తెలంగాణ భారీగా పెట్టుబడులు పెడుతోందని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ బలం దాని ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో ఉంది. మా నినాదం మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, తెలంగాణలో ఆవిష్కరణ అని పేర్కొన్నారు.