ఇండియాతో పోలిక.. పాకిస్తాన్‌ పరువు తీసిన కియోసాకి | Rich Dad Poor Dad Robert Kiyosaki exposes Pak oil shock vs India stability | Sakshi
Sakshi News home page

ఇండియాతో పోలిక.. పాకిస్తాన్‌ పరువు తీసిన కియోసాకి

May 2 2026 5:50 PM | Updated on May 2 2026 6:09 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki exposes Pak oil shock vs India stability

ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.

పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!
పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.

కియోసాకి ఏమన్నారంటే
‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’

పాక్‌లో భగ్గుమంటున్న ధరలు
ఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్‌లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.

భారత్ విజయం వెనుక రహస్యం..
భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్‌ను స్థిరీకరించగలదు.

భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.

పాక్ మంత్రి నిస్సహాయత
పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.

యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement