భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన సమయానికి కుప్పకూలాయి. ఎగుమతి పన్ను విధించాలన్న ప్రభుత్వ ఆదేశం.. అధిక చమురు ధరలు, భారత మార్కెట్పై ప్రభావం చూపుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో.. సంస్థ షేర్లు మార్చి 27, శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో 4% పైగా పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో సుమారు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లింది.
ఎన్ఎస్ఈ వెబ్సైట్ డేటా ప్రకారం.. బుధవారం మార్కెట్ ముగింపులో సుమారు రూ.19.12 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, శుక్రవారం మార్కెట్ సెషన్లో సుమారు రూ.80,000 కోట్లు తగ్గి రూ.18.32 లక్షల కోట్లకు పడిపోయింది.
శుక్రవారం మార్కెట్ సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4.23% పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.1,353.20కి చేరాయి. అంతకుముందు మార్కెట్ ముగింపులో ఈ షేర్ల ధర రూ.1,413.10గా ఉంది. మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఆర్ఐఎల్ షేర్లు 4.13% నష్టంతో రూ.1,354.80 వద్ద ట్రేడ్ అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎగుమతి పన్ను విధించినట్లు.. మార్చి 27న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ ఎగుమతి పన్నును ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.
నేటి స్టాక్ మార్కెట్
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.
ఇదీ చదవండి: ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?


