అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో.. సరఫరా పరమైన సమస్యలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయా? మానిటరీ పాలసీ పరమైన చర్య అవసరమా? అన్నది పరిశీలిస్తూ ఉంటామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025 నుంచి ఆర్బీఐ తటస్థ విధానాన్ని అనుసరిస్తున్నట్టు గుర్తు చేస్తూ, డేటా విషయంలో తగిన విధంగా స్పందించడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు.
ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. భారత్కు తరచుగా సరఫరా సమస్యలు ఎదురవుతున్నట్టు చెప్పారు. ‘‘ధరలు అదే పనిగా పెరుగుతూ, వేతన భారానికి, ఉత్పత్తి, రవాణా వ్యయాలకు దారితీస్తే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు కారణమవుతుంటే అప్పుడు విధానాన్ని కఠినతరం చేయాల్సి వస్తుంది’’అని మల్హోత్రా వివరించారు. ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యానికి మరో 2 శాతం వరకు వెసులుబాటు ఉన్న నేపథ్యంలో స్వల్పకాలంలో సరఫరా సమస్యలను ఆర్బీఐ సర్దుబాటు చేసుకోగలదన్నారు.
అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో, స్థూల ఆర్థిక పరమైన ప్రభావాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలుగుచూడాల్సి ఉందన్నారు. మానిటరీ పాలసీ కఠినతరం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే వాటిని తెలియజేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆర్బీఐ ఎంపీసీ తదుపరి పాలసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు జరగనుంది.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


