Former RBI Governor Raghuram Rajan Gets Slammed For Saying He Doesn't ‘care About India Being A Superpower - Sakshi
Sakshi News home page

‘ఐ డోంట్‌ కేర్‌’! ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ వ్యాఖ్యలపై విమర్శలు

Published Mon, Jun 19 2023 11:47 AM

raghuram rajan gets slammed for saying he doesnot care about india being superpower - Sakshi

ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ దేశ పురోగతికి సంబంధించి వెలుబుచ్చిన అభిప్రాయాలపై  విమర్శలు వ్యక్తమయ్యాయి. భారతదేశం అగ్రరాజ్యంగా మారుతుందనే భావనను ప్రశ్నిస్తూ రాజన్ చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది.

ఓ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాఘురామ్‌ రాజన్‌ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాను దేశ ఆర్థిక మంత్రి లేదా ప్రధానమంత్రి అయితే రాబోయే దశాబ్దంలో దేశ అభివృద్ధిలో తన పాత్ర ఎలా ఉండబోతుంది అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ భారతదేశం సూపర్ పవర్ హోదాను పొందడం పట్ల ఉదాసీనతను వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ దార్శనికతకు అనుగుణంగా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చడంపైనే తన దృష్టి ఉందని ఆయన ఉద్ఘాటించారు.

అది నాకు అసలు విషయమే కాదు..
‘భారతదేశం సూపర్‌ పవర్‌ (అగ్రరాజ్యం)గా ఉండటం గురించి నేను పట్టించుకోను, అది నాకు అసలు విషయమే కాదు. జాతిపిత కోరుకున్నట్లు ప్రతి భారతీయుడిని సంతోషంగా ఉంచడమే నా కర్తవ్యం’ అని రఘురామ్‌ రాజన్‌ అన్నారు. రఘురామ్‌ రాజన్‌ వెలుబుచ్చిన ఈ అభిప్రాయంపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు రాజన్ దృక్పథాన్ని తీవ్రంగా ఖండించారు. సూపర్ పవర్ స్థితిని సాధించడం అంటే పేదరికాన్ని తగ్గించడం, ఆరోగ్య సంరక్షణను, ప్రజల జీవన ప్రమాణాలను  మెరుగుపరచడం కాదా అని ప్రశ్నించారు.  

దేశ మొబైల్ ఫోన్ ఎగుమతులపైనా రఘురామ్‌ రాజన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ సప్లై చెయిన్‌లు, సెమీకండక్టర్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై రఘురామ్‌ రాజన్‌కు సరైన అవగాహన లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి: ఎన్‌పీఎస్‌ నుంచి నెలవారీ ఆదాయం

Advertisement
Advertisement