
జపాన్కు చెందిన ప్రముఖ అప్లయెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ నుంచి ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక రావు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారతదేశంలోని రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి పానాసోనిక్ నిష్క్రమించింది. ఈ సెగ్మెంట్లు రెండూ భారత్లో పానాసోనిక్కు నష్టాల్లో ఉన్న వ్యాపారాలు. ఇక్కడ మార్కెట్లో స్థానం సంపాదించడానికి కష్టపడుతున్నాయి.
మార్కెట్ రీసెర్చ్ సంస్థ జీఎఫ్కే గణాంకాల ప్రకారం.. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ విభాగాలలో పానాసోనిక్ చాలా తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. వాషింగ్ మెషీన్లలో దీని వాటా 1.8 శాతం, రిఫ్రిజిరేటర్లలో 0.8 శాతంగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో పానాసోనిక్ గత ఆరేళ్లుగా అమ్మకాల్లో నష్టాలను చవిచూస్తోంది.
రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి నిష్క్రమిస్తున్నప్పటికీ డీలర్ల వద్ద ఇప్పటికే ఉన్న ఆయా ఉపకరణాల అమ్మకాలకు సహకరిస్తామని, విడిభాగాలు, వారంటీ కవరేజీతో సహా పూర్తి కస్టమర్ సేవను అందిస్తూనే ఉంటామని పానాసోనిక్ తెలిపింది.
స్తబ్దత నుంచి బయటపడేందుకు, భవిష్యత్తులో బలమైన, పునరుద్ధరించిన వృద్ధి కోసం పానాసోనిక్ గ్రూప్ను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న వ్యాపారాల నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్నట్లు ఈ ఏడాది మేలో పానాసోనిక్ గ్రూప్ సీఈఓ యుకీ కుసుమి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పానాసోనిక్ ఇండియా ఆదాయం సుమారు రూ .11,500 కోట్లు.