పశ్చిమాసియా పరిస్థితులు కీలకం
చమురు ధరలు, రూపాయికీ ప్రాధాన్యం
దేశ, విదేశీ తయారీ, సరీ్వసు రంగ గణాంకాలపై దృష్టి
హీరో, బజాజ్, ఎంఅండ్ఎం, లుపిన్ పనితీరు వెల్లడి
ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కార్పొరేట్ దిగ్గజాల గతేడాది చివరి త్రైమాసిక పనితీరు ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దారి చూపనున్నాయి. అంతేకాకుండా విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..
నేడు(4న) ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెక్ పెట్టనున్నట్లు ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి. మరోపక్క తమిళనాడు ఫలితాలపైనా ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠతకు తెరతీయడంతో స్టాక్ ఇన్వెస్టర్లు సైతం వీటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు సైతం నేడు తెలియనున్నాయి.
దిగ్గజాలు రెడీ
ఇప్పటికే గతేడాది(2025–26) చివరి త్రైమాసిక ఫలితాల సీజన్ వేడెక్కింది. వారాంతాన కొటక్ మహీంద్రా బ్యాంక్సహా.. నాల్కో, సీడీఎస్ఎల్, స్టార్ హెల్త్, డీమార్ట్, ఏపీఎల్ అపోలో తదితరాలు క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం పనితీరు వెల్లడిచనున్నాయి. తాజా జాబితాలో అంబుజా సిమెంట్స్, బీహెచ్ఈఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జిందాల్ స్టెయిన్లెస్, ఎల్అండ్టీ, ఎస్ఆర్ఎఫ్, మారికో, కోఫోర్జ్తోపాటు.. ఆటో రంగ దిగ్గజాలు ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, హీరో మోటో, గోద్రెజ్ కన్జూమర్, పాలీక్యాబ్, శ్రీ సిమెంట్, బీఎస్ఈ, పిడిలైట్, లుపిన్, థెర్మాక్స్, ఏబీబీ, బీవోబీ, ఎంసీఎక్స్, స్విగ్గీ, కల్యాణ్ జ్యువెలర్స్ తదితరాలు చేరాయి.
గణాంకాలు
ఏప్రిల్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇదేవిధంగా చైనా, యూఎస్ పీఎంఐ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ప్రధానంగా యూఎస్ ఉపాధి కల్పన, నిరుద్యోగ వివరాలు తెలియనున్నాయి. గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. ఫెడ్ చైర్మన్గా పదవీ విరమణ చేయనున్న పావెల్ అధ్యక్షతన ఎఫ్వోఎంసీ ఫండ్స్ రేట్లను 3.5–3.75 శాతం స్థాయిలో అమలు చేసేందుకు నిర్ణయించింది.
చమురు మంట
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధమేఘాలు తొలగక పోవడం, హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ గత వారం ఒక దశలో 126 డాలర్లను తాకింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి 95కు పతనమైంది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. గతేడాదికి దేశీయంగా వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లను దాటేసింది. 2024–25లో ఇది దాదాపు 284 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మండుతున్న చమురు ధరలు దిగుమతులు బిల్లును పెంచడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.
ఆటుపోట్లకు చాన్స్
హార్ముజ్పై అనిశ్చితి, బలపడుతున్న చమురు ధరలు తదితర అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలకు ప్రాధాన్యమున్నప్పటికీ చమురు ధరలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అభిప్రాయపడ్డారు.
స్టాక్స్కు ఎఫ్పీఐల షాక్
ఏప్రిల్లో రూ. 60,847 కోట్లు ఔట్
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చేపడుతున్నారు. ఫలితంగా ఏప్రిల్లో నికరంగా రూ. 60,847 కోట్ల(6.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి 4 నెలల్లో(జనవరి–ఏప్రిల్) రూ. 1.92 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వెరసి 2025 పూర్తి కేలండర్ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్లకంటే అధికంగా అమ్మకాలకు తెరతీశారు. పశ్చిమాసియా సంక్షోభానికితోడు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి ఇన్వెస్టర్ల రిస్క్ సామర్థ్యాలను దెబ్బతీయడం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 4 నెలల్లో ఫిబ్రవరిలో మాత్రమే ఎఫ్పీఐలు(రూ. 22,615 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇది అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకావడం గమనార్హం! అయితే మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం ప్రస్తావనార్హం!!
గత వారమిలా..
తొలుత క్యూ4 ఫలితాలతో మార్కెట్లు బలపడినప్పటికీ ఇరాన్–యూఎస్ యుద్ధంతో చివర్లో డీలా పడ్డాయి. వెరసి గత వారం సెన్సెక్స్ నికరంగా 249 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుంది. 76,914 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు(0.4 శాతం) వృద్ధితో 23,998 వద్ద స్థిరపడింది. అయితే బ్యాంక్ నిఫ్టీ 2.2 శాతం పతనమైంది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.3 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ 2 శాతం జంప్చేయడం గమనార్హం!
సాంకేతికంగా చూస్తే..
ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణుల అంచనా. వీటి ప్రకారం నిఫ్టీకి 23,800–23,700 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ లభించవచ్చు. తదుపరి 23,500 వద్ద బలమైన మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 24,600 పాయింట్లను తాకవచ్చు. ఆపై 24,700– 27,800కు చేరే అవకాశముంది.
→ సెన్సెక్స్ 76,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ తీసుకునే వీలుంది. 77,500వరకూ పుంజుకోవచ్చు. 78,000 దాటితే 78,500 పాయింట్లను తాకే అవకాశముంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్


